ఈసారి దక్షిణాది నుంచి మోదీ పోటీ, ఎక్కడనుండంటే!

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుండి నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారా ? అవుననే అంటున్నది తమిళ మీడియా. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరం నుండే పోటీచేయటానికి మోడీ రెడీ అవుతున్నారని మలై మలర్ అనే మీడియా చెప్పింది. దీనికి మద్దతుగా తమకు కూడా ఇలాంటి సంకేతాలు అందినట్లు తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు. అంటే రామేశ్వరం నుండి మోడీ పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలేమో. ఇప్పుడు కాశీ నుండి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇంతకీ ఎక్కడో గుజరాత్ కు చెందిన మోడీ దక్షిణాది అదీ తమిళనాడు నుండి పోటీచేయాలని ఎందుకు ఆలోచిస్తున్నట్లు ? ఎందుకంటే దక్షణాదిలో బీజేపీ బలంపెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. అయితే సాధ్యంకావటం లేదు. ఉన్న ఒక్క కర్నాటకలో అధికారంలో కూడా ఊడిపోయింది. దాంతో రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో ఎన్ని స్ధానాల్లో వీలంటే అన్ని స్ధానాల్లో గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే రామేశ్వరం నుండి స్వయంగా మోడీనే రంగంలోకి దిగితే బాగుంటుందని అనుకుంటన్నట్లు సమాచారం. ఒక వైపు అయోధ్య టెంపుల్ పూర్తి కానున్న నేపథ్యంలో.. ఆ సెంటిమెంటును… రామసేతుకు ముడిపెట్టి దేశం మొత్తం రాముడి కోటాలో సీట్లు పెంచుకోవాలని మోడీ చూస్తున్నారు.

మోడీ పోటీ చేయడం వల్ల తమిళనాడుతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా మంచి ఊపు వస్తుందని కమలనాథులు అనుకుంటున్నారట. గతంలో ఇందిరాగాంధీ, మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధి కూడా చికమగళూరు, మెదక్, వాయనాడ్ లో పోటీచేసిన విషయం తెలిసిందే. ఇందిరా, రాహుల్ పోటీచేసి గెలిచారంటే కాంగ్రెస్ కున్న పట్టు అలాంటిది. కానీ అదే పద్దతిలో మోడీ పోటీచేయాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

తమిళనాడులో బీజేపీకి ఉన్న బలం సున్నా. ఈ విషయం తెలిసీ మోడీ పోటీ చేస్తారా అన్నదే అనుమానంగా ఉంది. గెలిస్తే బాగానే ఉంటుంది కానీ ఓడిపోతే మాత్రం ప్రభావం భయంకరంగా ఉంటుంది. రామేశ్వరం పార్లమెంటు పరిధిలో ముస్లిం సామాజికవర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. డీఎంకే మిత్రపక్షం ఐఎంయూల్ పార్టీ తరపున నవాజ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉంది. ఏఐఏడీఎంకేకి కూడా ఓట్లున్నా డీఎంకే, కాంగ్రెస్ కలిస్తే ప్రత్యర్ధుల గెలుపు కష్టమనే అనుకోవాలి. అందులోను బీజేపీ అభ్యర్ధి గెలుపును అసలు ఊహించలేము. మరి చివరకు మోడీ ఏమి చేస్తారన్నది ఆసక్తిగా మారింది.