సిట్టింగులతోనే సమస్యా ?

ఒకపుడు ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను రాసిచ్చేయటమే ఇపుడు కేసీయార్ కు తలనొప్పులుగా తయారైంది. దాదాపు తొమ్మిదేళ్ళపాటు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలదే రాజ్యమైపోయింది. ఒకవిధంగా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు రాజులుగా చెలామణి అయిపోతున్నారు. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు ఏమిచేసినా కేసీయార్ పిలిచి ప్రశ్నించింది లేదు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా కనీసం కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో ఏమైందంటే తమకు కేసీయార్ పూర్తిస్ధాయిలో స్వేచ్చ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఆకశమేహద్దుగా చెలరేగిపోయారు. దాని ఫలితం ఏమైందంటే భూకబ్జాలు, అవినీతి, అరాచకాలు, అత్యాచారాలు, లైగింక వేధింపుల్లో కొందరు ఎంఎల్ఏలు ఇరుక్కున్నారు.

నలుగురు ఎంఎల్ఏలపైన లైగింక వేధింపుల ఫిర్యాదులున్నాయి. చాలామంది ఎంఎల్ఏల మీద భూకబ్జా ఆరోపణలున్నాయి. ముగ్గురు ఎంఎల్ఏల భూకబ్జాలపై స్వయంగా కుటుంబసభ్యులే ఫిర్యాదులుచేశారు. ఇక అరాచకాలు, అవినీతికి అయితే అంతేలేదు. 45 మంది ఎంఎల్ఏలపైన అవినీతి ఆరోపణలున్నట్లు స్వయంగా కేసీయారే ఒక సమీక్షలో అసంతృప్తి వ్యక్తంచేశారంటే పరిస్ధితి అర్ధంచేసుకోవచ్చు. ఆరోపణలు వినబడుతున్న ఎంఎల్ఏల్లో ఎవరిని కూడా కేసీయార్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నించలేదు.

ఇపుడేమైందంటే అదంతా ఎన్నికల్లో రివర్సుకొట్టే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంఎల్ఏలకే టికెట్లిస్తే గెలవరని కేసీయార్ చేయించుకున్న సర్వేల్లో బయటపడుతున్నాయి. అలాగే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులపైన పార్టీ నేతలే బాహాటంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సిట్టింగులకు టికెట్లిస్తే గెలవరని కారునేతలే అంటున్నారు. చాలామంది ఎంఎల్ఏలపై వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా బ్యాడ్ ఇమేజి ఉందని సర్వేల్లోనే బయటపడుతోంది. దాంతో ఇపుడు సమస్య ఏమిటంటే సర్వేల్లో ఫీడ్ బ్యాక్ సరిగాలేదు కాబట్టి టికెట్లు నిరాకరించేందుకు లేదు.

ఎందుకంటే వాళ్ళు ఎదురుతిరుగుతారనే భయం. కొన్ని సంవత్సరాలుగా ఆర్ధికంగా విపరీతంగా బలోపేతమైపోయారు. కాబట్టి కేసీయార్ కు ఎదురుతిరిగినా తిరుగుతారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో వాళ్ళకే మళ్ళీ టికెట్లిస్తే ఎంతమంది గెలుస్తారో తెలీదు. ఇపుడిదే సమస్య కేసీయార్ ను బాగా పట్టి పీడిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటం ఖాయమనేంత జోష్ నేతల్లో కనబడుతోంది. దాంతో కొందరు నేతలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జంపైపోతున్నారు. మొత్తానికి కేసీయార్ కు పెద్ద సమస్యే వచ్చిపడింది.