రంగా చుట్టూ రాజ‌కీయం.. ప‌వ‌న్ మ‌రిచిపోయారా..?

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. అయితే.. గ‌త ఏడాదికి.. ఇప్ప‌టికీ.. చాలా తేడా క‌నిపించింది. గ‌త ఏడాది అన్ని పార్టీలు కూడా.. రంగా జ‌యంతిని ఆకాశ‌మంత పందిళ్లు వేసి మ‌రీ నిర్వ‌హించాయి. కానీ, ఈ ఏడాది ఆ త‌ర‌హా ఉత్స‌వాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. ఒక్క కొడాలి నాని(గుడివాడ‌) మాత్రం రంగా చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌రోవైపు..రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధా మాత్రం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇక‌, త‌ర‌చుగా రంగా గురించి ప్ర‌స్తావించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రంగా జ‌యంతి రోజు మాత్రం కిమ్మ‌న‌కుండా ఊరుకు న్నారు. గ‌త ఏడాది ఆయ‌న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన ప‌వ‌న్‌.. నివాళుల‌ర్పిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక‌, ఇటీవల వారాహి యాత్ర‌లో కూడా.. ప‌వ‌న్ రంగా గురించి చెప్పుకొచ్చారు. చిన్న‌ప్పుడు ఆయ‌న‌కు తాను టీ అందించాన‌ని.. రంగా త‌మ ఇంటికి కూడా వ‌చ్చార‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌, కాపుల ఓటు బ్యాంకుకు కీల‌కంగా ఉన్న రంగాను ఆయ‌న ప‌దే ప‌దే త‌న ప్ర‌సంగాల్లోనూ ప్ర‌స్తావించారు.

అలాంటిది అనూహ్యంగా ప‌వ‌న్ గానీ జనసేన గాని రంగా జయంతి రోజున ఏ కార్య‌క్ర‌మం ప్రత్యేకంగా నిర్వహించలేదు. ఇదిలావుంటే.. వైసీపీ కూడా.. గ‌త ఏడాది రంగా జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించింది. రంగాను త‌మ వాడే అన్న‌ట్టుగా కూడా పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకున్నారు. తిరిగి రాధా వ‌స్తే.. చేర్చుకునేందుకు సిద్ధ‌మేన‌న్న విధంగా అప్ప‌ట్లో మంత్రులు కొంద‌రు వ్యాఖ్యానించారు. కానీ, ఈ సారి ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన రంగా జ‌యంతిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో అస‌లు.. రంగా ఎవ‌రి వాడు? ఏ పార్టీకి చెందిన వాడు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు..రంగా పేరు ఎత్తినా.. వైఎస్ పేరు ఎత్తినా.. త‌మ‌కే పేటెంట్ ఉంద‌ని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ద‌ఫా.. రంగాను ప‌క్క‌న పెట్టేసింది. క‌నీసం ఆయ‌న ప్ర‌స్తావ‌న‌ను కూడా పార్టీ నాయ‌కులు తీసుకురాలేదు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. రంగా అవ‌స‌రం లేకుండానే పార్టీలు ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాపు సామాజిక‌ వ‌ర్గం ప‌వ‌న్ వెంట ఉన్న‌ట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రంగాను అంద‌రూ పూజిస్తార‌ని అనుకున్నా.. అనూహ్యంగా అన్నిపార్టీలూ రంగా ప్ర‌స్తావ‌న లేకుండా చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి తెర‌వెనుక వ్యూహాలేంటో తెలియాల్సి ఉంది.