సైకిల్ ఎక్కలేని చంద్రబాబు…జగన్ సెటైర్లు

Jagan to pick 50 new candidates for 2024 elections

చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు ఏపీ సీఎం జగన్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్… చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్రపూరితంగా తన హెరిటేజ్ డైరీ కోసమే చిత్తూరు డైరీని చంద్రబాబు మూయించి వేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే డైరీని మూసేశారని, తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత జిల్లా రైతులను చంద్రబాబు నిట్టనిలువునా ముంచేశారని జగన్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా రైతులను ఆదుకునేందుకే తాము చిత్తశుద్ధితో ఈ డైరీని తెరిపిస్తున్నామని, ఈ క్రమంలోనే డైరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేస్తున్నామని జగన్ చెప్పారు. పాదయాత్రలో చిత్తూరు డైరీని తెరిపిస్తానని తాను హామీ ఇచ్చానని, అందుకే 182 కోట్ల బకాయిలను తీర్చి డైరీ ఓపెన్ చేస్తున్నానని అన్నారు. ఈ డైరీలో 325 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమూల్ డైరీ ముందుకు వచ్చిందని జగన్ చెప్పారు. చిత్తూరుకు చంద్రబాబు చేసిందేమీ లేదని, చంద్రగిరిలో గెలవలేనని తెలిసే కుప్పానికి వలస వెళ్లారని విమర్శించారు.

అది తెలుసుకున్న కుప్పం ప్రజలు కూడా బాయ్ బాయ్ బాబు అంటున్నారని, అందుకే మరోసారి కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడని ఆరోపించారు. 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటానంటూ డ్రామా చేస్తున్నాడని సెటైర్లు వేశారు. 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారని ఆరోపించారు. ఓ పథకం ప్రకారమే చిత్తూరు డైరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు.

అందుకే రాష్ట్రంలో అతిపెద్ద డైరీని తెరిపించేందుకు నాంది పలికామని జగన్ చెప్పారు. చంద్రబాబుది గజదొంగల ముఠా అని, ఆ ముఠా ఆట కట్టిస్తామని జగన్ అన్నారు. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని నాయకుడు ఒకరని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక, ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాస్ నిండని నాయకుడు ఇంకొకరు అని పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.