బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్:లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా లోకేష్….స్థానిక మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ‘మహాశక్తితో లోకేష్’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువతులు, మహిళలు, గృహిణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లోకేష్ కు వారు మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ కు లోకేష్ ముద్దు పేరు పెట్టారు. ఇకపై బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని పిలుద్దాం అంటూ సెటైర్లు వేశారు. అరకు, పాడేరు ప్రాంతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు ఆధ్వర్యంలో గంజాయి పండిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మన్యం, అరకు ప్రాంతాలలో పండించిన గంజాయిని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు పంపిణీ చేస్తున్నారని, డీలర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోందని లోకేష్ ఆరోపించారు. అధికారంలో ఉన్నవాళ్లే గంజాయిని సాగు చేసి సరఫరా చేస్తుంటే యువతీయువకులు గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారని లోకేష్ ఆరోపించారు.

తాడేపల్లిలో రోజుకో గంజాయి ఘటన జరుగుతోందని, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి మత్తులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటివరకు ఈ సీఎం జగన్ స్పందించలేకపోయాడని దుయ్యబట్టారు. నాయకుడు కఠినంగా లేడని, అందుకే వైసీపీ నేతలకు భయం, భక్తి లేక ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారని ఆరోపించారు. 2024 మే నెలలో న్యూస్ ఛానల్స్ లో టీడీపీ మెజారిటీ నియోజకవర్గాలలో లీడింగ్ లో ఉంది అన్న వార్త వచ్చిన వెంటనే ఏపీలో లా అండ్ ఆర్డర్ సెట్ అవుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి చంద్రబాబు అంటే హడల్ అని, లోకేష్ తప్పు చేసినా చంద్రబాబు ఊరుకోరని అన్నారు.