బీజేపీలో ముసలం…ఆ ఎమ్మెల్యే గుడ్ బై?

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో బిజేపీకి కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన జీహెచ్ ఎంసీ, హుజూర్ నగర్ ఎన్నికల్లో బిజేపీ హవా కొనసాగడంతో రాష్ట్రంలో ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. మునుగోడులో ఓటమిని మినహాయిస్తే తెలంగాణలో బీజేపీకి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని కమలనాథులు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అయితే, అదే సమయంలో తెలంగాణ బిజెపిలోని లుకలకలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం బీజేపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇప్పటికే, బండి సంజయ్ వర్సెస్ ఈటల వార్ నడుస్తోంది. దీంతో, పార్టీకి ఈటల గుడ్ బై చెబుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే పార్టీపై బాంబు పేల్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీపై తనకున్న అసంతృప్తిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అనుచరుల దగ్గర వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఆహా రాత్రులు కష్టపడిన వారికి గుర్తింపు దక్కడం లేదని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారట. టీఆర్ఎస్ పై పోరాడుతున్న తనకు పార్టీ నుంచి సహకారం అందడం లేదని, గ్రూపు రాజకీయాలు చేస్తున్న వారికే హై కమాండ్ అండగా ఉంటోందని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగినా తనకు ఇవ్వలేదని, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి లేదా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఎదురుచూసినా ఫలితం దక్కలేదని అసహనం వ్యక్తం చేశారట. కనీసం రాష్ట్రస్థాయిలో అయినా గుర్తింపు లభిస్తుందని చేస్తారని భావిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారట. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన జేపీ నడ్డా దగ్గర కూడా రఘునందన్ తన అసంతృప్తి వెళ్లగక్కినట్టుగా తెలుస్తోంది. తనకు తగిన గుర్తింపు లభించుకుంటే పార్టీని వీడేందుకు కూడా రఘునందన్ వెనకాడడం లేదని తెలుస్తోంది.

తెలంగాణలో తాను గెలిచిన తర్వాత బీజేపీలో కొత్త జోష్ వచ్చిందని రఘునందన్ వ్యాఖ్యానించారట. దుబ్బాకలో బీజేపీ గెలుపు పార్టీకి కిక్ ఇచ్చిందని, ఆ తర్వాత పార్టీ బలోపేతం అయిందని రఘునందన్ అంటున్నారట.