భీమవరం సభలో పవన్ తుస్సుమనిపించారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకొని పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ భీమవరం సభలో ఏదో చెబుతారని ఎక్స్పెక్ట్ చేసిన జనానికి ఏమీ చెప్పకుండా తుస్సుమనిపించారని ఆయన ఎద్దేవా చేశారు.

ఆ సభ పై పవన్ విపరీతమైన సస్పెన్స్ క్రియేట్ చేశారని, కానీ, చివరకు అది ఫ్లాప్ షో గా ముగించారని సెటైర్లు వేశారు. వైసీపీ పాలనలో యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారని పవన్ చేసిన విమర్శలన్నీ అబద్ధాలేనని ఆయన కొట్టిపారేశారు. జనసేన అబద్దపు ప్రసంగాలు చేసే ప్యాకేజీ పార్టీ అని మరోసారి పవన్ రుజువు చేశారని విమర్శలు గుప్పించారు. పవన్ తనను తాను మోసం చేసుకుంటున్నారని, మహనీయుల పేర్ల మాటున నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పార్టీ పెట్టారని, తన కోసం, జనసైనికుల కోసం కాదని విమర్శించారు, కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబాన్ని గతంలో చంద్రబాబు తీవ్రంగా హింసించారని, ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజలు బాధపడ్డారని గ్రంధి గుర్తు చేశారు. ఊసరవెల్లి కన్నా ఎక్కువసార్లు పవన్ రంగులు మారుస్తున్నారని చురకలంటించారు. తనకు కాపు కులస్తులతోపాటు అభిమానులు కూడా ఓటు వేయలేదని, సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

పవన్ కు చంద్రబాబులో భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారని సెటైర్లు వేశారు. భీమవరం డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్ టిడిపి హయాంలో ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జగన్ లా ప్రజలకు మంచి చేసేందుకు పవన్ 100 జన్మలు ఎత్తాలని వ్యాఖ్యానించారు. జ్వరం వచ్చిందని చెప్పి రెస్ట్ తీసుకుంటానన్న పవన్ చివరకు మిగిలిపోయిన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారని సెటైర్లు వేశారు. తన గురించి పవన్ చెబితే తెలుసుకునే స్థాయిలో భీమవరం ప్రజలు లేరని అన్నారు.