సంచలనంగా మారిన విశాఖ సీపీ బదిలీ నిర్ణయం

మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు. ఒక ఉన్నత పోలీసు అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం.. అది కూడా రాత్రి పదకొండు గంటల వేళ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశాఖను ఏపీ పరిపాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్న వేళ.. కోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆయన్ను బదిలీ చేయటం విస్మయానికి గురి చేసింది.

సీపీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కూడా కాని వేళ.. ఆయన్ను బదిలీ చేయటం అధికారిక వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది. పరిపాలనా వ్యవహారాల్లో భాగంగానే బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. అదేమీ నమ్మశక్యంగా లేదన్న మాట వినిపిస్తోంది.

స్వతహాగా సౌమ్యుడిగా పేరున్న ఆర్కే మీనా ఇంత హడావుడిగా బదిలీ చేయాల్సిన అవసరం ఏముందన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటివరకు విశాఖ నగర పోలీస్ కమిషన్ గా వ్యవహరిస్తున్న వారు కనీసం రెండేళ్లకు పైనే పని చేశారని.. అలాంటిది మీనాను మాత్రం ఏడాదిన్నరకే బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానిస్తున్నారు.

వివాదారహితుడిగా పేరున్న ఆయన హయాంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తనకు నేరుగా సంబంధం లేకున్నా.. సిబ్బంది తీసుకున్ననిర్ణయాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. విపక్షనేత చంద్రబాబును ఎయిర్ పోర్టులో అడ్డుకున్న అధికారపార్టీ నేతల తీరుపై హైకోర్టుకు స్వయంగా హాజరైన సమాధానం చెప్పాల్సి వచ్చింది.

అంతేకాదు.. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపైనా దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. తన నిరసనతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై చేతులు.. కాళ్లను తాళ్లతోకట్టేసి.. స్టేషన్ కు.. తర్వాత ఆసుపత్రికి.. ఆ తర్వాత మానసిక వైద్యశాలకు తరలించటం వివాదం కావటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల జరిగిన సీఐ బదిలీలకు సంబంధించి తమ రికమండేషన్లను పక్కన పెట్టేశారన్న అసంతృప్తి అధికార పార్టీ ఎమ్మెల్యేల్యలో ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే.. ఆయన బదిలీకి కారణమంటున్న వారు లేకపోలేదు.

అయితే.. ఈ బదిలీకి సంబంధించి మరో వాదన కూడా ఉంది. ప్రస్తుతం సీపీగా ఉన్న ఆర్కే మీనా అదనపు డీజీగా పదోన్నతి పొందారు. విశాఖ సీపీ పోస్టు ర్యాంకు ఐజీ మాత్రమే. ఉన్నత అధికారిగా ఉంచటం ఇష్టం లేకనే బదిలీ చేసినట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ ఈ వాదనే నిజమైన పక్షంలో.. విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని కానుంది. అదేజరిగితే నగర సీపీ పోస్టు అప్ గ్రేడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అదనపు డీజీ స్థాయి అధికారి సీపీగా ఉండాలి. అలాంటప్పుడు మీనా సరిపోతుారు. మరి బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న సందేహాన్ని కొందరు వినిపిస్తున్నారు.

అదే సమయంలో బదిలీ చేసిన సమయం కూడా కీలకమంటున్నారు. అంత రాత్రి వేళలో బదిలీ నిర్ణయం వెలువడటం ఏమిటి? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తంగా మీనా బదిలీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.