ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై 5 నిమిషాల పాటు సీఎం జ‌గ‌న్ పంచ్‌లు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్తాయిలో ధ్వ‌జమెత్తారు. వారాహి యాత్ర స‌హా, ప‌వ‌న్ వివాహాల‌పై ఆయ‌న నిశిత విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో నిర్వ‌హించిన జ‌గ‌న‌న్న అమ్మ ఒడి నాలుగో విడ‌త నిధుల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప‌వ‌న్‌పై 5 నిమిషాల పాటు పంచ్‌లు విసిరారు. “వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్‌” అని విరుచుకుప‌డ్డారు.

ఈ వ్యాఖ్య‌లు చేసే ప్పుడు జ‌గ‌న్ ముసిముసి న‌వ్వులు చిందిస్తూ మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ… ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌నలా నాలుగేళ్ల‌కోసారి భార్య‌ను మార్చాలా? అది మా వ‌ల్ల జ‌రిగే ప‌నికాద‌ని వ్యాఖ్యానించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పెద్ద మ‌నిషి నీతులు చెబుతున్నారంటూ.. విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ అనే మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను కురుక్షేత్రంతో పోల్చిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల్లో త‌న‌కు ప్ర‌జ‌లే పెద్ద దిక్క‌ని.. ప్ర‌జ‌ల‌తోనే పొత్తు ఉంటుంద‌ని.. వారే త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు. “నేను మంచి చేస్తున్నాన‌ని భావిస్తే.. మీరు మీబిడ్డ‌కు అండ‌గా నిల‌వండి” అని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇత‌ర పార్టీలతో పొత్తుల కోసం ఏ నాడూ ఆలోచించ‌లేద‌న్నారు. పాకులాడనూ లేద‌న్నారు.  రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. “మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు” అని వ్యాఖ్యానించారు.  మొత్తంగా ప‌వ‌న్‌పై 5 నిమిషాల పాటు ఆప‌కుండా జ‌గ‌న్ ప్ర‌సంగించ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.