రాష్ట్రంలో నాలుగు కోతులు.. మంచి విన‌రు-క‌న‌రు:  సీఎం జ‌గ‌న్ ఫైర్‌

Jagan Mohan Reddy Serious On His MLAs

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు జీర్ణించుకోలేక పోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నార‌ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమ‌ర్శించారు.  జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా  కురుపాం  నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధ్య‌క్షులు పవన్‌ కల్యాణ్‌పైనా మండిపడ్డారు.

నారా చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల రాజకీయంలో ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదని అన్నారు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారని అన్నారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయని, మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానమ‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు.

“దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్‌ వారాహి అనే ఓ లారీ ఎక్కి  ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు” అని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు.  

దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోందని జ‌గ‌న్ అన్నారు. కానీ, వైసీపీ పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయ‌ని జ‌గ‌న్ చెప్పారు. అందుకే పనికి మాలిని పంచ్‌ డైలాగులు ఉండవని,  బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డామ‌ని ఆయ‌న వివ‌రించారు. పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదన్నారు.  రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామ‌న్న జ‌గ‌న్‌ మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదని, దత్తపుత్రుడిని నమ్ముకోలేదని వ్యాఖ్యానించారు. “జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ ఇంట మంచి జరిగిందని భావిస్తే.. ఆదరించండి” అని జ‌గ‌న్ పిలుపునిచ్చారు.