హైద‌రాబాద్ కాకుండా అమ‌రావ‌తికే ఆ చాన్స్ ఉంద‌ట‌!

కొద్దికాలం కిందటి వ‌ర‌కు హాట్ హాట్‌గా జ‌రిగిన చ‌ర్చ ప్ర‌స్తుతం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. దేశానికి రెండో రాజ‌ధాని చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ప‌రిశీలిస్తోందని అందులో ముఖ్యంగా హైద‌రాబాద్‌ను సీరియ‌స్‌గా గ‌మ‌నిస్తోందనేది ఆ ప్ర‌చారం సారాంశం. అయితే, ఎంత వైర‌ల్ అయిందో అంతే వేగంగా తెర‌మ‌రుగు అయిపోయింది. అయితే, మ‌ళ్లీ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే, ఓ నాయ‌కురాలి డిమాండ్ రూపంలో మాత్ర‌మే.

న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని, మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌నే డిమాండ్ చేస్తూ అమ‌రావ‌తి ప్రాంత రైతులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, విజయవాడ‌లో అమరావతి మహిళా జేఏసీ నాయ‌కురాలు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతుందని పేర్కొన్న ఆమె విశాఖలో రాజధాని శంఖుస్థాపనకి రావడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా అని ప్ర‌శ్నించారు. ప్రధాని హోదాలోనే మోదీ అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన‌ప్పుడు మళ్లీ వైజాగ్‌లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారు అని ప్ర‌శ్నించారు.

ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్న మోదీ, జగన్ పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారు అని ప‌ద్మ‌శ్రీ‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంఖుస్థాపనకి రావాలి అనుకుంటే అమరావతిలో మోదీ శంఖుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ల చేతులతోనే తీసేయాలి అని మ‌రో ప్ర‌తిపాద‌న చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులంటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని మండిప‌డ్డారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం మాకు ఉందని ప‌ద్మ‌శ్రీ పేర్కొన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగేమన దేశానికి కూడా రెండో రాజధాని అవసర‌మ‌ని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి, రెండో రాజధానిని దక్షిణ భారత దేశంలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విశ్లేషించారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతి విడిది ఉంది కాబ‌ట్టి అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.