జగన్ కు మోడీ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇదేనా?

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ 5 జోన్ లో వేలాది ఇళ్ళ నిర్మాణాలకు వచ్చేనెలలో భూమిపూజ జరగబోతోంది. జూలై 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఆర్ 5 జోన్ లో ఏకకాలంలో 47 వేల ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. 47 వేల ఇళ్ళనిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నుండి ప్రతిపాదన అందగానే కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళనిర్మాణ పథకంలో వేలాది ఇళ్ళను నిర్మించాలని జగన్ అనుకున్నారు.

ఇందుకు అనుగుణంగానే ఈమధ్యనే జగన్ వేలాదిమందికి ఇళ్ళపట్టాల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ పట్టాల్లో ఇళ్ళు నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని, ఇళ్ళను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అనుమతి ఇంత వేగంగా వస్తుందని వైసీపీ నేతలు కూడా అనుకోలేదు.  ఇదే విషయమై సోమవారం సమావేశమైన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇళ్ళపట్టాలపై న్యాయవివాదం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇళ్ళపట్టాలు పంపిణీచేయవచ్చు కానీ అది అంతిమ తీర్పుకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఇలాంటి న్యాయ చిక్కులు ఉన్నపుడు సాధారణంగా అనుమతులు రావు. కానీ కేంద్రం అనుమతి ఇచ్చేసింది.

అయితే ఇళ్ళపట్టాల పంపిణీకి ఓకేనే కానీ ఏకంగా వేలాది ఇళ్ళు కూడా కట్టేస్తే ఎలాగన్నదే అసలు సమస్య. అంతిమతీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు కట్టేసిన ఇళ్ళ విషయంలో ప్రభుత్వమైనా, కోర్టయినా ఏమి చేయగలుగుతుంది. ఇళ్ళనిర్మాణాలకు కేంద్రప్రభుత్వం ఒక్కో ఇంటికి రు. 1.5 లక్షల రూపాయలిస్తోంది. ఇదికాకుండా రాష్ట్రప్రభుత్వం షేర్ రు. 30 వేలుంటుంది. కేంద్రం షేర్ నే తీసుకుంటే 47 వేల ఇళ్ళకు 1.5 లక్షల చొప్పున 705 కోట్లు వృధా అవుతుందనటంలో సందేహంలేదు.

వ్యవహారం న్యాయస్ధానం పరిధిలో ఉన్నా కేంద్రం రు. 705 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు ఇళ్ళు కట్టేసిన తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే కట్టేసిన ఇళ్ళను కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటాయా ? అన్నదే అసలు పాయింట్. మొదటి విడతలో 47 వేల ఇళ్ళకు రెండో విడతలో మరో 4 వేల ఇళ్ళ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటమే ఆశ్చర్యంగా ఉంది.