టీడీపీ కొత్త వ్యూహం.. త్వ‌ర‌లోనే మ‌రో కార్య‌క్ర‌మం..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ప‌లుకార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చి అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అదేవిధంగా ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్య‌క్ర‌మాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. తాజాగా మ‌రో కార్య‌క్ర‌మంతో చంద్ర‌బాబు ముందుకు వ‌చ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్  వేదికగా ఈ వినూత్న కార్య‌క్ర‌మానికి సంబంధించిన‌ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ..  రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల  అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ కార్యక్రమం  చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. దీనికి “రాష్ట్ర‌మా.. రావ‌ణ కాష్ట‌మా!“ అనే స‌బ్ టైటిల్ కూడా చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఊరూవాడా ప్ర‌చారం చేస్తామ‌ని వివ‌రించారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడతారని చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా ‘నాలుగేళ్ల నరకం’ రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని చెబుతూ.. నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తామ‌న్నారు.  ప్రజల వద్దకు నేతలు ఆయా కార్య‌క్ర‌మాల‌ను తీసుకువెళతారని చంద్రబాబు తెలిపారు.