ఏపీలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేదు: సుమ‌న్

ఏపీ రాజ‌కీయాల‌పైనా.. ఇక్క‌డి పార్టీల‌పైనా న‌టుడు సుమ‌న్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అన్నారు. అదే స‌మయంలో ఇత‌ర కులాలైన రెడ్డి, క‌మ్మ‌, కాపు, ఎస్సీ కులాల‌కు రాష్ట్రంలో రాజ‌కీయ వేదిక‌లు ఉన్నాయ‌ని.. కానీ, బీసీల‌కు ఒక వేదిక కూడా లేదని విమ‌ర్శించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వ‌స్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో గ‌త నాలుగేళ్లుగా బీసీ సామాజిక వ‌ర్గాల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని..అయితే.. వీరిని రాజ‌కీయంగా వాడుకుంటున్న పార్టీలు.. ఈ దారుణాల‌పై ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

గుంటూరు జిల్లా పేదకాకానిలో స్వ‌తంత్ర స‌మ‌ర‌యోదుడు, మాజీ ఎమ్మెల్యే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సినీ నటుడు సుమన్, టీడీపీ నేత గౌతు శిరీష ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీసీల‌ను అణ‌దొక్కి.. వారికి అండ‌గా ఉన్నామ‌ని కొంద‌రు చెబుతున్నార‌ని.. ఇది బీసీల‌ను ఒక‌ర‌కంగా అవ‌మానించ‌డ‌మేన‌ని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని సుమన్ విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రించారు. బాపట్లలో పదో తరగతి విద్యార్థిని అత్యంత దారుణంగా చంపితే చర్యలే లేవని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కులానికో పార్టీ ఉందని, బీసీలకు పార్టీ లేదని సుమన్‌ అన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలని ఆయ‌న బీసీల‌కు పిలుపు నిచ్చారు. బీసీల‌కు మేలు చేసే పార్టీల దగ్గరకే బీసీలు వెళ్లాలని సుమన్‌ సూచించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని, అలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు సుమన్ తెలిపారు.