పవన్‌ను జోగయ్య ముంచుతారా? విజయంలో ముంచెత్తుతారా

ఏపీ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ వేడి పెంచుతున్నారు. తన వారాహి రథంపై కాపు కోటల్లో దూసుకెళ్తున్నారు. నేనే సీఎం అంటూ జబ్బులు చరుస్తున్నారు. పాలక వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ చెప్పుకొచ్చిన పవన్ ఎందుకో సొంతంగా ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపుల ఓట్లు లక్ష్యంగా చురుగ్గా రాజకీయం చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కాపుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, సీనియర్ లీడర్ చేగొండ హరిరామజోగయ్య సలహాల ప్రకారమే పవన్ సొంత ప్రయాణం దిశగా ఆలోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా హరిరామ జోగయ్య సర్వేల పేరిటి కొద్దిరోజులుగా పవన్‌కు హైప్ తీసుకొస్తున్నారు.. వారాహి యాత్ర పూర్తయితే పవన్‌ను కొట్టేవాడే ఉండడని ఆయన చెప్తున్నారు.

ఈ ఫీడింగ్ పవన్ వద్ద కూడా బాగానే పనిచేసిందని.. పవన్ జోగయ్య మాటలను నమ్మి సొంతంగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు. అయితే… జోగయ్య సర్వేలు ఎంతవరకు ప్రామాణికం.. వయసు మళ్లిన జోగయ్య జనం నాడిని సరిగానే పట్టుకోగలగుతున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జోగయ్య మాటలను పూర్తిగా నమ్మి ఒంటరి పోరుకు దిగితే మరోసారి దెబ్బవడం ఖాయమని జనసేనలోని చాలామంది అంటున్నారు.

బలమైన క్యాడర్.. ఎన్నికల అనుభవం ఉన్న టీడీపీతో కలిసి నడిస్తే పొత్తులు కుదుర్చున్న మేరకు సీట్లు గెలవగలమని.. గట్టిగా పట్టుపడితే నాలుగైదు మంత్రి పదవులు కూడా తెచ్చుకోగలమని జనసేనలో చాలామంది నేతలు ఆశ పడుతున్నారు.

వాస్తవాల ప్రాతిపదికగా ఆలోచిస్తున్న ఇలాంటివారంతా జోగయ్య జోక్యంపై మండిపడుతున్నారు. కాగా జోగయ్య సర్వేలు కూడా పూర్తిగా రెండు గోదావరి జిల్లాలకే పరిమితమవుతున్నాయి. అందులోనూ.. ఒక్కో నియోజకవర్గంలో 500 శాంపిళ్లే తీసుకున్నట్లు జోగయ్య చెప్తున్నారు. రాజకీయంగా పోలరైజేషన్ తీవ్రంగా ఉన్న సందర్భంలో లక్షన్నర నుంచి 3 లక్షల ఓట్లుండే నియోజకవర్గాలలో 500 శాంపిళ్లు అంటే చాలా తక్కువ. ఇంత చిన్న శాంపిల్‌తో జనం నాడి పట్టుకోవడం కష్టం.

కాపులు, బీసీలు, ఎస్సీలు అందరూ ఈ 500 శాంపిళ్లలోనే ఉన్నట్లు జోగయ్య చెప్తున్నారు. దీంతో.. జోగయ్య మాటలు నమ్మి పవన్ ఏం చేస్తారో అని పార్టీలో కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆయన చెప్పినట్లు పవన్ సొంతంగా పోటీ చేసి ప్రభంజనం సృష్టిస్తే అందరం సంతోషిస్తామని.. ఒకవేళ తేడా కొడితే తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. ఈ ఎన్నికలకు టీడీపీతో కలిసి వెళ్లడం ఉత్తమం అనే మాట జనసేనలో బలంగా వినిపిస్తోంది.