‘మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు’

పొలిటిక‌ల్ క్యామెడీ కింగ్ కేఏ పాల్ తాజాగా అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత‌.. శాంతిదూత‌నైన త‌న‌నే సీఎం చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేద‌ని అన్నారు. శుక్రవారం అనంత‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్ళానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు. కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానన్నారు.

వ్య‌క్తిగ‌తంగా తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా 100 మంది బౌన్సర్స్లతో.. చంద్రబాబులా హై సెక్కురిటీతో తిరగడంలేదని.. సింగిల్‌గా వెళుతున్నానని పాల్‌ అన్నారు. ‘‘చంద్రబాబు.. దమ్ముంటే నాతో డెబిట్‌కు రా.. ఎలాగూ లోకేష్‌కు మాట్లాడడం రాదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు.“ అని వ్యాఖ్యానించారు.

ఇక‌, జ‌న‌సేన‌పైనా పాల్ విరుచుకుప‌డ్డారు. కేవ‌లం 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని, దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యాల‌ని స‌వాల్ రువ్వారు. పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీలోకి వ‌చ్చి.. జ‌న‌సేన‌ను విలీనం చెయ్యాల‌ని పిలుపునిచ్చారు. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని పాల్ విమ‌ర్శించారు.

త‌న‌ను ఓ కామెడీ కింగ్‌లాగా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయని కేఏ పాల్‌ మండిపడ్డారు. ఆదాని, అంబానీలతో నార్త్ మీడియాను మోడీ కొనేశారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యా.. కేతిరెడ్డి వద్దు, బాబు వద్దు మీరు సీఎం కావాలని అన్నారన్నారు. 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేఏపాల్ విమర్శలు గుప్పించారు.