ముద్రగడకు కన్ఫర్మ్ అయిపోయిందా ?

రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పోటీచేయటం కన్ఫర్మ్ అయిపోయిందా ? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖలో వచ్చేఎన్నికల్లో కాకినాడలో కానీ కుదరదంటే పిఠాపురంలో కానీ పోటీచేయాలని చాలెంజ్ చేశారు. పిఠాపురంలో పోటీచేసి తనను ఓడించాలని సవాలు విసరటంలోనే ముద్రగడ పోటీపై ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోయింది.

ముద్రగడ వైసీపీలో చేరి పిఠాపురం లేదా ప్రత్తిపాడు అసెంబ్లీల నుండి పోటీ చేయచ్చనే ప్రచారం జరుగుతోంది. లేదా కాకినాడ పార్లమెంటులో కూడా పోటీచేసే అవకాశముందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకసారి ముద్రగడే పోటీచేస్తారని లేదు లేదు ముద్రగడ కొడుకు పోటీచేస్తారని అంటున్నారు. అయితే పవన్ కు రాసిన లేఖలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉత్సాహంతో తాను ఉన్నట్లు ముద్రగడే చెప్పారు. తనపైన పవన్ చేసిన ఆరోపణలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉత్సాహం, ఆలోచన వచ్చినట్లు చెప్పుకున్నారు.

దాంతో ముద్రగడ రాబోయే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీచేయటం ఖాయమని అందరు అనుకుంటున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ పెండెం దొరబాబుకు టికెట్ దక్కటం కష్టమనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడినుండి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డితో చెప్పారని కూడా సర్క్యులేషన్లో ఉంది. వంగా గీత పోటీచేస్తారా లేకపోతే ముద్రగడ రంగంలోకి దిగుతారా అన్న విషయంలో క్లారిటి లేదుకానీ దొరబాబుకైత టికెట్ దక్కదనే అందరు అనుకుంటున్నారు.

సడెన్ గా పవన్ కు రాసిన లేఖతో పిఠాపురంలో పోటీచేయబోయేది ముద్రగడే అని ఎవరికి వాళ్ళుగానే కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో తెలీదు కానీ ముద్రగడ పోటీచేయ సీటు పిఠాపురమే అని మాత్రం కాపు సామాజికవర్గాల్లోని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. మరి పిఠాపురంలో పవన్-ముద్రగడ పోటీచేస్తే రాజకీయం ఎలాగుంటుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తం అందరి దృష్టిని ఆకర్షించబోయే నియోజకవర్గం పిఠాపురమే అవుతుందేమో.