ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడుగా ఏపీ సీఐడీ అధికారులు న‌మోదు చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో విధులు నిర్వ‌హిస్తున్నారు.

అయితే.. ఈ కేసులో ఆయ‌న‌ను విచారించేందుకు స్థానిక కోర్టు గ‌త ఏడాదే అనుమ‌తి ఇచ్చింది. కానీ, సునీల్ కుమార్‌.. మ‌రోసారి ప‌ట్నా హైకోర్టును ఆశ్ర‌యించి.. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ముంద‌స్తు ర‌క్ష‌ణ పొందారు. ఈ గ‌డువు కూడాపూర్తికావ‌డం.. ఏపీ పోలీసులు ప‌ట్నా హైకోర్టును ఆశ్ర‌యించి.. సునీల్ నాయ‌క్‌పై ఉన్న కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డంతో ప‌ట్నా హైకోర్టు అరెస్టుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌ను బీహార్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

అక్క‌డి నుంచి సునీల్ నాయ‌క్‌ను.. గుంటూరుకు తీసుకురానున్నారు. కాగా.. వైసీపీ హ‌యాంలో రఘురామను క‌స్ట‌డీలోకి తీసుకుని టార్చ‌ర్ చేసిన స‌మ‌యంలో ప‌క్క‌నే సునీల్ నాయ‌క్ కూడా ఉన్నార‌ని… ర‌ఘురామ ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏపీలో డిప్యూటేష‌న్‌పై విధులు నిర్వ‌హిస్తున్నారు. త‌న‌ను క‌స్ట‌డీలో ఎవ‌రు కొట్టారు? ఎవ‌రి ప్రోద్బ‌లంతో కొట్టారు? అనే విష‌యాలు సునీల్ నాయ‌క్‌కు తెలుసున‌ని కూడా.. ర‌ఘురామ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే నాయ‌క్‌ అరెస్టుకు ప‌ట్నా హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

మ‌రోవైపు.. ఈ కేసులోనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాష్ట్ర కేడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను గ‌త ఏడాదే స‌స్పెండ్ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆయ‌న స‌స్పెన్ష‌న్‌ను మ‌రింత కాలం పొడిగించింది. వ‌చ్చే జూన్ 30వ తేదీన ఆయ‌న రిటైర్ కానున్నారు. అయితే.. ఈ కేసుల్లో విచార‌ణ ముగిసే వ‌ర‌కు ఈ స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. సో.. మొత్తంగా ర‌ఘురామను టార్చ‌ర్ చేసిన కేసులో పురోగ‌తి క‌నిపిస్తోంది.