వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప్ర‌శాంతి రెడ్డి దంప‌తులు సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ త‌ర్వాతే.. రాష్ట్ర ప్ర‌భుత్వం తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో న‌కిలీ నెయ్యి వినియోగంపై ఏక‌స‌భ్య క‌మిష‌న్‌ను నియ‌మిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారానికి.. వేమిరెడ్డి-సీఎంతో భేటీ అయిన దానికి పెద్ద సంబంధ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వేమిరెడ్డి గ‌తంలో వైసీపీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి అప్ప‌ట్లోనే టీటీడీ బోర్డు స‌భ్యురాలిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే టీటీడీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించిన వైవీ సుబ్బారెడ్డి పీఏ.. చిన్న అప్ప‌న్న వ్య‌వ‌హారాన్ని వేమిరెడ్డి చూశార‌ని.. ఆయ‌న ప్రోద్బ‌లంతోనే చిన్న‌ప్ప‌న్న‌కు ఢిల్లీలో ప‌ద‌వి ద‌క్కింద‌ని.. దీనికి వైవీకి సంబంధం లేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం చిన్న అప్ప‌న్న ఖాతాలో 4.6 కోట్ల రూపాయ‌ల నిధులు అక్ర‌మంగా వ‌చ్చాయ‌న్న‌ది సీబీఐ చెబుతున్న వాద‌న‌.

ఈ క్ర‌మంలో చిన్న అప్ప‌న్న.. వైవీ సుబ్బారెడ్డి అనుచ‌రుడ‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే.. కాదు..వేమిరెడ్డి అనుచ‌రుడుగా మారార‌ని.. అప్ప‌న్న ఖాతాలో ఉన్న‌వి ఆయ‌న సొమ్ములేనని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. దీనిపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న వేమిరెడ్డి.. తాజాగా నోరు విప్పారని పొలిటికల్ టాక్. వైవీ సుబ్బారెడ్డి చెప్పినందునే.. చిన్న అప్ప‌న్న వ్య‌వ‌హారాన్ని తాను చూశానని.. కొంత మేర‌కు సాయం చేసింది కూడా వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

అయితే.. త‌న‌కు ఈ విష‌యంలో నేరుగా ఎలాంటి సంబంధం లేద‌ని కూడా వేమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. చిన్న అప్ప‌న్న‌తో త‌న‌కు ఉన్న సంబంధాలు.. న‌గ‌దు బ‌దిలీ కి సంబంధించిన అంశాల‌పై సీఎం చంద్ర‌బాబు వేమిరెడ్డి పూస గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

సీబీఐ విచార‌ణ‌కు రాని అనేక అంశాలు కూడా దీనిలో ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైవీ కేంద్రంగా ఏక‌స‌భ్య క‌మిష‌న్ విచార‌ణ జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంపై వైసీపీలో పెను క‌ల‌క‌లం చోటు చేసుకుంది.