‘హలో ఏపీ.. బైబై వైసీపీ’..

Pawan kalyan

ఎన్నికల్లో ఇపుడు స్లోగన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల సైకో పోవాలి సైకిల్ రావాలి అనే స్లోగన్ బాగా హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు కొత్త నినాదాలిచ్చారు. అవేమిటంటే మొదటిది ‘హలో ఏపీ..బైబై వైసీపీ’. ఇక రెండో స్లోగన్ ఏమిటంటే ‘జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలి’. కోనసీమలోని అమలాపురం యాత్ర సందర్భంగా మాట్లాడుతు పవన్ ఈ రెండు స్లోగన్లను ప్రకటించారు. నిజానికి ఎన్నికల సమయంలో స్లోగన్లే రాజకీయపార్టీలను బాగా పాపురల్ చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. తానిచ్చిన రెండు స్లోగన్లకు పవన్ మద్దతుగా తన వివరణలను కూడా ఇచ్చుకున్నారు.

విషయం ఏదైనా స్లోగన్లు గనుక క్యాచీగా ఉన్నాయని జనాలకు అనిపిస్తే వాటిని పదేపదే చెప్పుకుంటారు. ఈ పద్దతిలోనే సదరు పార్టీ పాజిటివ్ గానో లేకపోతే నెగిటివ్ గానో జనాల నోళ్ళల్లో నానుతుంటుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల ఇచ్చిన బైబై బాబు అనే స్లోగన్ కూడా చాలా పాపులరైంది. జనాలు చెప్పుకోవటానికి, వైసీపీ నేతలు చెప్పటానికి బైబై బాబు అనే స్లోగన్ చాలా తేలికగా ఉండేది. అలాగే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఇచ్చిన స్లోగన్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇంతకీ ఆ స్లోగన్ ఏమిటంటే జాబు రావాలంటే బాబు రావాలి అని. టీడీపీ నేతలతో పాటు మద్దతుదారులు సోషల్ మీడియాతో పాటు రోడ్లపైన గోడల మీద కూడా ఇదే నినాదాన్ని రాశారు. దాంతో ఈ స్లోగన్ జనాల్లోకి ఫుల్లుగా ఎక్కేసింది.

2024 ఎన్నికలకు కూడా ఇది వరకు కాంగ్రెస్ ఇచ్చిన నినాదం గరీబీ హఠావో, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇప్పటికీ జనాల్లో మారుమోగుతునే ఉన్నాయి.

నినాదాలతోనే పార్టీలు అధికారంలోకి వచ్చేస్తాయని కాదు. కానీ తమ పార్టీ విధానాలను తేలిగ్గా జనాలకు అర్ధమయ్యేట్లుగా, జనాలు ఒకటికి పదిసార్లు మాట్లాడుకునేట్లుగా ఇలాంటి నినాదాలు బాగా పనిచేస్తాయి. ఇక అధికారంలోకి రావటమంటారా అది అధినేతల చేతుల్లోనే ఉంటుంది. ఇపుడు పవనిచ్చిన రెండు స్లోగన్లు జనాల్లోకి బాగా వెళ్ళాలంటే జనసేన నేతలు, సోషల్ మీడియా వింగ్ ఏ విధంగా పాపులర్ చేస్తాయనేదాని మీద ఆధారాపడుంది.