ఎవరా 18 మంది? సీఎం జగన్ దగ్గరున్న హిట్ లిస్టు ఇదేనా?

పార్టీ నేతలు ఎవరైనా.. తనకు వారెంత సన్నిహితమైనా.. పార్టీకి.. నష్టం వాటిల్లే అవకాశం ఉన్నంతనే నిక్కచ్చిగా వ్యవహరించేందుకు అస్సలు వెనుకాడరు వైసీపీ అధినేత. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే జగన్ జగన్ చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పవర్ ఫుల్ అంటారు కానీ.. మాజీ సీఎం చంద్రబాబు మాదిరే ఆయన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి కిందా మీదా పడిపోతారు.

కానీ.. సీఎం జగన్ మాత్రం అలా కాదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేందుకు మొహమాటపడరు. పని తీరు మార్చుకోవాలని.. ప్రజలకు దగ్గర కావాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని పదే పదే చెప్పినప్పటికీ తీరు మార్చుకోని నేతలకు సంబంధించి.. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఓపెన్ గా చెప్పేయటం తెలిసిందే. మొత్తం ఎమ్మెల్యేల్లో 18 మంది గ్రాఫ్ బాగోలేదన్న జగన్ మాట.. అధికార పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకూ జగన్ సిద్ధం చేసుకున్న హిట్ లిస్టులో ఉన్న ఆ పద్దెనిమిది మంది ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది. గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు.. ఇన్ ఛార్జిలే ఈ హిట్ లిస్టులో ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జాబితాలు దర్శనమిస్తున్నాయి. సోర్సు ఏమైనా.. సదరు నేతలు జగన్ అదే పనిగా ప్రస్తావిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొనలేదని చెబుతున్నారు.

నిఘా వర్గాల నుంచి ముఖ్యమంత్రికి అందిన నివేదికలో ఎవరెవరు ఉన్నారన్నది హాట్ టాపిక్ గా మారిన వేళ.. ఒక జాబితా తాజాగా చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాలో మంత్రులు.. మాజీ మంత్రులతోపాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన 18 మంది జాబితాలోని పేర్లను చూస్తే..

మంత్రుల్లో..

  • ఆర్కే రోజా
  • తానేటి వనిత
  • జోగి రమేశ్‌
  • పినిపె విశ్వరూప్‌
  • కొట్టు సత్యనారాయణ
  • గుడివాడ అమర్నాథ్‌
  • కారుమూరి నాగేశ్వరరావు
    మాజీ మంత్రుల్లో..
  • కొడాలి నాని
  • బాలినేని శ్రీనివాసరెడ్డి
  • మేకతోటి సుచరిత
  • పాముల పుష్పశ్రీవాణి
  • అనిల్‌ కుమార్‌ యాదవ్‌
  • ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు
    ఎమ్మెల్యేల్లో..
  • రెడ్డి శాంతి
  • గ్రంధి శ్రీనివాసరావు
  • వసంత కృష్ణప్రసాద్‌
  • కోలగట్ల వీరభద్రస్వామి
  • ఆళ్ల రామకృష్ణారెడ్డి

సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతున్న ఈ జాబితా ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాలి. ఒక అంచనా ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వంలో మొత్తం ఎమ్మెల్యేల్లో 65 మంది తిరగలేదని చెబుతారు. సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బొత్స సత్యానారాయణలు పెద్దగా పర్యటించలేదు. వయసు రీత్యా కానీ.. సీనియార్టీ రీత్యా కానీ వీరికి తిరిగే కార్యక్రమాలకు మినహాయింపు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.