షర్మిలకు రాజ్యసభ, ఏపీ బాధ్యతలు.. డీకే శివకుమార్ డీల్

ఇతర పార్టీలలో విలీనం చేయడానికి తాను పార్టీ పెట్టలేదని వైఎస్ షర్మిల చెప్తున్నప్పటికీ జరుగుతున్న రాజకీయం మాత్రం వేరేగా కనిపిస్తోంది. షర్మిల, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డీల్ కుదిర్చినట్లుగా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. దాని ప్రకారం ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపిస్తారని.. అలాగే ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగానూ నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన షర్మిల పాదయాత్రలకు మారుపేరు. గతంలో ఏపీలో తన సోదరుడు జగన్ కు అండగా షర్మిల రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. అనంతరం సోదరుడితో విభేదాలు తలెత్తినట్లుగా అన్ని వర్గాలలో ప్రచారం ఉండడం.. ఆ తరువాత ఆమె తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అంటూ కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తెలసిందే. కొత్త పార్టీ పెట్టాక కూడా ఆమె తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ తన మెట్టినిల్లు అంటూ ఇక్కడే రాజకీయాలు చేస్తానంటూ కాస్త దూకుడుగా వ్యవహరించారు. నిత్యం పాలక బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండేవారు. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఆమెపై ఆంక్షలు, అడ్డుకోవడాలు ఎక్కువయ్యాయి.

షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపించాయి. అదే సమయంలో షర్మిల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా లేనప్పటికీ రెడ్డి సామాజిక వర్గ ఓట్లను ఆమె చీలుస్తారన్న అంచనాలు మాత్రం చాలామందిలో ఉన్నాయి. ఆమె ఎంత శాతం ఓట్లను చీల్చగలరు? అది ఎంత స్వల్పం అనేది పక్కన పెడితే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ తీవ్రంగా పోటీ పడుతున్న వేళ షర్మిల అర శాతం ఓట్లు చీల్చినా కూడా తమకు నష్టం కలగొచ్చని కాంగ్రెస్ నేతల్లో ఒక భయం ఉంది. ఆ క్రమంలోనే వారు షర్మిలను తమ పార్టీలోకి తీసుకొచ్చి రెడ్డి ఓట్ల చీలికను నివారించేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి అటు రేవంత్ రెడ్డి, ఇటు షర్మిలకు కూడా సన్నిహితుడైన డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది.

అయితే.. రాజ్యసభకు ఆమెను కర్ణాటక నుంచి పంపించడం వరకు ఖరారుగానే కనిపిస్తున్నా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను ఆమె చూస్తారా.. అన్న జగన్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతారా అన్నది స్పష్టత లేదు. సోదరుడితో రాజకీయ, ఆర్థిక అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ ఆయన సీఎంగా ఉన్న చోట రాజకీయంగా ఆయనతో తలపడడానికి షర్మిల కానీ, తల్లి విజయమ్మ కానీ సిద్ధపడతారా అనేది ప్రశ్నగా మారింది. అదే జరిగితే షర్మిల కాంగ్రెస్ చేరిక తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలలో కాక పుట్టించడం ఖాయం.