జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు

తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని వైసీపీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పింది. విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను తప్పుపడుతు పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సజ్జల చేసిన ప్రకటన ఆధారంగా వైసీపీ గుర్తుంపు రద్దుచేయాలని ఎంపీ నానా రచ్చ చేశారు. ప్రకటన ఆధారంగానే కమీషన్ కూడా వైసీపీకి నోటీసులు జారీచేసింది.

ఆ నోటీసులకు పార్టీ తరపున ఎన్నికల కమీషన్ కు సమాధానం వచ్చినట్లుగా ఎంపీకి కమీషన్ చెప్పింది. నిజానికి శాశ్వత అధ్యక్షుడు అన్నా రెండేళ్ళకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చెప్పినా ఫలితమొకటే. ఎందుకంటే ఏ ప్రాంతీయపార్టీని తీసుకున్నా అధినేతలే శాశ్వత అధ్యక్షులుగా ఉంటారు. టీడీపీకి చంద్రబాబునాయుడు, డీఎంకేకి స్టాలిన్, ఎస్సీకి అఖిలేష్ యాదవ్, ఎన్సీపీకి శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ కు మమతా బెనర్జీలే ఉదాహరణ.

ప్రాంతీయ పార్టీల్లో అధినేతలు బతికున్నంతకాలం మరోకళ్ళు వాళ్ళస్ధానంలో అధ్యక్షులు కాలేరన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏదో మొక్కుబడిగా రెండేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించినట్లు అందులో తామే అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారంతే. ఈమాత్రం ఇంగితం కూడా వైసీపీలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇతర ప్రాంతీయపార్టీలు ఏమిచేస్తున్నాయో కూడా ఆలోచించే స్ధితిలో వైసీపీ లేదు. శాశ్వత అధ్యక్షుడు అనే పద్దతి లేదని కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పినపుడు దాన్ని పాటించాలి.