కన్నబాబు విషయంలో పవన్ పశ్చాత్తాపం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై మాత్రం పవన్ విమర్శలు చేయలేదు. దీంతో, సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం తరఫున కన్నబాబు గెలిచారని, మెగా ఫ్యామిలీతో కన్నబాబుకు సన్నిహిత సంబంధాలున్నందునే ఆయనపై పవన్ విమర్శలు చేయడం లేదని నెటిజన్లు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చి తప్పు చేశామని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చినప్పుడు ఆయన చేతిలో చిల్లిగవ్వలేదని, ఎన్నికల ఖర్చు మొత్తం చిరంజీవి పెట్టుకున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు ఈనాడు రిపోర్టర్ గా ఉన్న కన్నబాబును చిరంజీవి చేరదీసి పార్టీలో చేర్చుకున్నారని, ఆ తర్వాత టికెట్ ఇచ్చి గెలిపించారని అన్నారు. కానీ, ఈరోజు జనసేనపై కన్నబాబు విమర్శలు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశానని పవన్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే యువతను వైసిపి నాయకులు వాడుకుంటున్నారని, సమాజాన్ని కులాల వారీగా విడదీసి ఓట్లు దండుకుంటున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, యువత భవిష్యత్తును వైసీసీ నేతలు మర్చిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారని, కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారో లేదో వైసీపీ నాయకులు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ బిడ్డని చెరుకు తోటలో నిర్ధాక్షిణ్యంగా కాల్చేస్తే బీసీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేశారని నిలదీశారు. ఏమైనా మాట్లాడితే కన్నబాబు బాధపడతారని, తామే రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి తమపై విమర్శలు చేయడం తమ దురదృష్టకరమని అన్నారు.