రాహుల్‌ – షర్మిల .. అస‌లు ఏం జ‌రుగుతోంది?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఇటీవ‌ల కాలంలో వేస్తున్న అడుగులు రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారాయి. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. ఆమె కొత్త‌గా పార్టీ పెట్టుకున్నారు. పాద‌యాత్ర‌లు చేశారు. చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆమె మ‌న‌సు కాంగ్రెస్ వైపు మ‌ళ్లింద నే చ‌ర్చ సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

దీంతో రాజ‌కీయంగా ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నార‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త వారం తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వైఎస్సార్ టీపీఅధ్య‌క్షురాలిపై అనేక వార్త‌లు వ‌చ్చాయి. వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్ర‌రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ష‌ర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్ర‌క్రియ ప్రారంభించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్ద‌లు కూడా ష‌ర్మిల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వెలుగు చూసింది.

అయితే.. ఈ వార్త‌లు… వ్యాఖ్య‌ల‌పై అటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు ష‌ర్మిల పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. మ‌రోవైపు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌తోనూ ఇప్ప‌టికే రెండు మూడు ప‌ర్యాయాలు ష‌ర్మిల భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో తాజాగా రాహుల్‌గాంధీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేయడం మ‌రింత ఆస‌క్తిగా మారింది.

ష‌ర్మిల ఏమ‌న్నారంటే..
రాహుల్ గాంధీగారికి.. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీ ఓర్పు, స‌హ‌నంతో కూడిన రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల‌ను స్పూర్తి మంతం చేయాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుతున్నా. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి.. విజ‌యాలు అందుకోవాల‌ని కోరుతున్నా అని పేర్కొన్నారు.

ఈ ప‌రిణామాలతో ష‌ర్మిల వ్యూహం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. గ‌తంలో ఆమె త‌న పార్టీని ఏ పార్టీతో విలీనం చేయ‌బోన‌ని చెప్పిన మాట‌ను విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ బీఆర్ ఎస్ కోట‌ను కూల‌గొట్టి అధికారం ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల పార్టీ స‌హా క‌ల‌సి వ‌చ్చే పార్టీల‌తో చేతులు క‌లిపేందుకు ఆపార్టీ సిద్ధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.