వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర మొదలుపెట్టేశారు.

ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు కూడా జగన్ టార్గెట్ గా ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ తమ పర్యటనల్లో జనాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. బీజేపీ మాత్రమే ఇంకా ఆ పనిచేయలేదు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది. ఉమ్మడిగా పోటీచేయాలని అనుకుంటున్నపుడు ప్రణాళిక లేదా మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉండాలి కదా.

అందుకనే పొత్తులపై వచ్చే నెలలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముంది. కానీ తెలంగాణ లో ఉన్నది ఆరు నెలలు మాత్రమే. పొత్తులుపెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం. వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా మరోసారి చంద్రబాబుతో భేటీ జరపబోతున్నారట. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఢిల్లీలో భేటీ తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశం అవటానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు మూడుపార్టీల తరపున ఉమ్మడి ప్రణాళికను రెడీచేయబోతున్నట్లు ప్రకటిస్తారట. మూడుపార్టీల్లోని సీనియర్లు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తారని తెలుస్తోంది. జరుగుతున్నది చూస్తుంటే జగన్ను ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న పట్టుదల ప్రతిపక్షాల్లో బలంగానే కనబడుతోంది. మరి పొత్తులంటే సీట్ల సర్దుబాటు, పోటీచేయబోయే నియోజకవర్గాలు తదితరాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయో చూడాల్సిందే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు మాత్రం జగన్ చెప్పినట్లుగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేట్లే ఉంది.