బీఆర్ఎస్ నుంచి కీల‌క నేత ఔట్‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు మాసాల గ‌డువే ఉంది. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ సాధించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీఆర్ ఎస్ పార్టీ నుంచి నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్‌లో పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది.

హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృత స్థాయిలో చర్చ జరిగినట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది.

పార్టీ అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకో వాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

అయితే.. సరిగ్గా ఎన్నికలకు 5 నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మ‌రోవైపు సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.