‘కొత్తకోట’ లాంటోళ్లు అరుదుగా వస్తారంతే

ఇప్పుడున్న రాజకీయాల్లో నిన్నటి లెక్క నిన్నటిదే. ఇవాల్టి లెక్క ఇవాల్టిదే. ఫక్తు వ్యాపారంగా మారిపోయిన రాజకీయాల్లో.. కొత్తకోట దయాకర్ రెడ్డిలాంటి వారి ఉదంతాలు విన్నప్పుడు.. అలాంటి వారు వెళ్లిపోతున్న వైనానికి వేదన కలిగించక మానదు. తమకు స్థాయిని కల్పించే పార్టీని నమ్ముకొని ఉండిపోవటమే తప్పించి.. పదవుల కోసం పార్టీలు మారేందుకు సుతారం ఇష్టపడని పాతతరం నాయకులకు కొత్తకోట లాంటోళ్లు నిలువెత్తు చిహ్నాలు. తాను నమ్మిన తెలుగుదేశంలో ఉండిపోయి.. చివరకు ఆ పార్టీ నేతగా వెళ్లిపోయిన కొత్తకోట దయాకర్ రెడ్డి పాడె మోసిన చంద్రబాబు..ఆయన కమిట్ మెంట్ కు తగ్గ రుణాన్ని తీర్చుకున్నారని చెప్పాలి.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి విభజనకు ముందు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి వారికి ఉన్నత పదవులు లభించకపోవటం. విభజన జరిగి..కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన టీడీపీ తరఫున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి ఆయన కోరుకుంటే వేరే పార్టీలోకి వెళ్లటం పెద్ద విషయం కాదు. తాను సిద్ధంగా ఉన్నానన్న మాటనను కాకితో కబురు పంపినా స్పందించే పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ.. తనకు ఉనికిని ఇచ్చిన పార్టీని విడిచి పెట్టి వెళ్లేందుకు ఆయన సుతారం ఇష్టపడలేదు.

అనారోగ్య కారణాలతో మరణించిన ఆయన మరణవార్త విన్నంతనే చంద్రబాబు హుటాహుటిన కొత్తకోట స్వగ్రామానికి వెళ్లి.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనటమేకాదు.. పార్టీని నమ్ముకున్న నేత పాడెను స్వయంగా మోసి రుణాన్ని తీర్చుకున్నారని చెప్పాలి. ఎన్టీఆర్ కు.. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. విభజన నేపథ్యంలో తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల మీద అవగాహన ఉన్నప్పటికీ.. పార్టీ మారటం ఆయనకు నచ్చలేదు. అందుకే ఉండిపోయారు.

తెలుగుదేశం పార్టీ అంటే ఆయన ఎంత కమిట్ మెంట్ ఉంటారన్న దానికి ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తారు. కొన్నాళ్ల క్రితం టీడీపీ ప్రధానకార్యాలయంలో కనిపించిన కొత్తకోటను ఉద్దేశించి.. ‘పార్టీలోని పెద్ద పెద్ద నేతలంతా వెళ్లిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. మీరు మాత్రం పార్టీలో ఉండిపోయారు. కారణం ఏమిటి?’ అని అడిగితే.. ‘‘దేవుడి దయ వల్ల కొన్నిఎకరాల పొలం ఉంది.నాకు ఇతరుల మాదిరి అత్యాశ లేదు.పార్టీకి ద్రోహం చేయలేను’’ అని బదులిచ్చారు.

పార్టీ పట్ల నేతలకు ఉండాల్సిన కమిట్ మెంట్ ఏమిటన్న మాటకు నిదర్శనంగా కొత్తకోట మాట నిలుస్తుంది. ఇవాల్టి రోజున.. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీ కష్టాల్లో ఉన్న వేళ.. తన దారి తాను చూసుకుంటూ వేరే పార్టీలోకి వెళ్లిపోయిన కమిట్ మెంట్ ఉన్న లీడర్లను చూస్తున్న రోజుల్లో.. పదవులు.. పవర్ లేకున్నా ఫర్లేదు.. పార్టీలో కంటిన్యూ కావటానికే ప్రాధాన్యత ఇచ్చే నేతలు అరుదుగా ఉంటారు. అందులో కొత్తకోట ఒకరు. అలాంటి కమిట్ మెంట్ ఉన్న నేత పాడెను మోయటం ద్వారా చంద్రబాబు సరైన వీడ్కోలు పలికారనే చెప్పాలి.