సోముకు అమిత్ షా క్లాస్‌.. రీజ‌నేంటి..?

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు కేంద్ర మంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ సిట్టింగు స్థానాన్ని కోల్పోవ‌డం.. క‌న్నా లక్ష్మీనారాయ‌ణ స‌హా.. కేడ‌ర్ పార్టీకి దూరంగా ఉండ‌డం.. పార్టీ మారిపోవ‌డం స‌హా.. అనేక లోతుపాతుల గురించి.. అమిత్ షా కూలంక‌షంగా చ‌ర్చించార‌ని తెలిసింది. నిజానికి అమిత్‌షా విశాఖ ప‌ర్య‌ట‌న‌కు ముందు…త‌మిళ‌నాడులో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ చేశారు.

ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడుకు చేరుకున్న కొంద‌రు బీజేపీ ఏపీ నేత‌లు.. ఆయ‌న‌తో క‌ల‌సి విమానంలో విశాఖ‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఏపీలో ఉన్న ప‌రిస్థితి, పార్టీ నేత‌ల దూకుడు. వ‌చ్చే ఎన్నిక‌లు పార్టీ స‌భ్య‌త్వం.. గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఇలా.. అన్ని అంశాల‌ను షా తెలుసుకున్నార‌ని అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.ఈ క్ర‌మంలో గ‌త ఆరు మాసాల్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను షా సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి బీజేపీ పుంజుకోవాల‌ని భావిస్తోంద‌ని.. ఈ స‌మ‌యంలో కొత్త‌గా మ‌రికొన్ని స్థానాల్లో విజ‌యం దక్కించుకునే దిశ‌గా రాష్ట్ర నాయ‌కులు అడుగులు వేయ‌డం మానేసి.. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటును ఎందుకు కోల్పోయార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో క‌న్నా స‌హా.. ఇంకెంత మంది పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని ఆరా తీసిన‌ట్టు తెలిసింది. క‌న్నా పార్టీ మారిపోయి వెళ్లి పోవ‌డం వెనుక రీజ‌న్లు తెలుసుకుని.. సోము వీర్రాజు పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

బ‌హుశా .. అందుకేనేమో… స‌భ‌లో సోము వీర్రాజు మొహంలో ఎక్క‌డా సంతోషం క‌నిపించ‌లేదు. ఆయ‌న చాలా ముభావంగా ఉన్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల పొత్తుల విష‌యాన్ని తాము చూసుకుంటామ‌ని… ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ పై పోరాటం చేయ‌డంలో అవ‌స‌ర‌మైతే.. అన్ని పార్టీల‌ను కూడా క‌లుపుకొని పోవాల‌ని సూచించార‌ట‌. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. సోము నాయ‌క‌త్వం పై అమిత్‌షాకు క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు.