డిసెంబరులో ఏపీ ఎన్నికలు… పవన్ బ్రేకింగ్ ఇది !

Pawan kalyan

జనసేన అధినేత నోటి నుంచి బ్రేకింగ్ న్యూస్ మాట వచ్చింది. మొన్నటికి మొన్న కేబినెట్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్ని కొట్టిపారేయటం తెలిసిందే. కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న మాటను స్పష్టం చేశారు. ఇంత క్లారిటీగా ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి ఎన్నికల మాట వచ్చినప్పటికీ జనసేనాని మాత్రం అందుకు భిన్నంగా చేసిన తాజా వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఒక పార్టీ అధినేతగా పవన్ అంత తొందరపడి మాట్లాడటం ఉండదు. అందునా.. కీలక విషయాల గురించి మాట్లాడే టైంలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడతారు. గతంలో పలుమార్లు ఇదే విషయాన్ని ఆయన చెబుతూ.. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ముందు తనలోపల ఎంతో మధనం జరుగుతుందని చెబుతుంటారు. అలాంటిది ఎన్నికల గురించి పవన్ అంత తేలిగ్గా మాట్లాడరని.. ఆయనకు కచ్ఛితమైన సమాచారం ఉన్న కారణంతోనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.

తాజాగా యాగాన్ని నిర్వహించిన అనంతరం తాడేపల్లిలోని తన కార్యాలయంలో కొద్దిమంది జనసేనకు చెందిన నేతల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడిన పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తాయని స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పొత్తులపైనా ఆయన కీలక వ్యాఖ్య చేయటం గమనార్హం. అయితే పొత్తు గురించి మాట్లాడాదామని లేదు.. ఒంటరిగా పోటీ చేయాలంటే ఎలా వెళ్లాలో తాను చెబుతానని చెప్పారు. కానీ.. ఎవరూ కూడా చిత్తశుద్ధి/నిజాయితీ (ఇక్కడ పవన్ ఇంటిగ్రిటి అన్న పదాన్ని వాడారు)ని మాత్రం చంపుకోవద్దన్నారు.

తెలంగాణలో డిసెంబరులోనే ఎన్నికలు కదా? అన్న ప్రశ్న వేసిన పవన్.. అందుకు జనసైనికులు అవునన్న మాట చెప్పటం.. ఆ వెంటనే.. ‘దాదాపుగా ఆంధ్రా.. తెలంగాణ రెండు కలిపే వస్తాయి’ అని వ్యాఖ్యానించటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చగా మారింది. పవన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటను ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవటం.. వార్తాంశంగా క్యారీ చేయకపోవటం గమనార్హం. పవన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.