ఇండియన్ కరోనాను జగన్ ఎదుర్కోగలరు: బీజేపీపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్య

ఏపీ మంత్రి కొడాలి నాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీని కూడా కరోనాతో పోలిస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని, అందుకే ఓ చోట అధికారంలోకి వచ్చామని, మరోచోట లోకసభ ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకున్నామని ట్వీట్ చేసింది. అవినీతి కుటుంబ పాలనతో రాష్ట్రాలను పీడిస్తున్న టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ వైరస్‌లకు బీజేపీ దేశవ్యాప్తంగా ఓ వ్యాక్సిన్ వంటిదని పేర్కొంది.

ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో కొడాలి నాని టీడీపీ, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కరోనా వైరస్ చైనాలు పుట్టిందని, అలాగే, ఇండియాలో పుట్టిన కరోనా బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ బీజేపీ కరోనా పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, త్రిపుర, ఒడిశాలో కాంగ్రెస్‌ను తినేసిందని, కమ్యూనిస్టులు, జనతా పార్టీ వంటి అన్నింటిని తినేస్తుందన్నారు. ఏపీకి కూడా ఇప్పటికే బీజేపీ అనే కరోనా వచ్చిందన్నారు.

అందుకే మనం ఏపీలో మాస్కులు వంటివి పెట్టి జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాస్కులు సహా అన్నీ తీసేసి, ఆయనే వారిపైకి ఎగబడ్డాడని, అలాంటి సమయంలో బీజేపీ కరోనా ఆయనను ఎందుకు వదులుతుందని, పార్టీని కబలించేందుకు సిద్ధమైందని చెప్పారు. అయితే వైసీపీ అజాగ్రత్తగా ఉంటే ఇండియన్ కరోనా మీ పార్టీని కూడా కబలిస్తుందా అంటే జగన్‌ను ఏ కరోనా ఏం చేయలేదన్నారు.

కరోనా సోకిన కొంతమంది వ్యక్తులకు సింప్టమ్స్ బయటకు కనిపించవని, కొంతమంది ఊపిరాడక ప్రాణం పోగొట్టుకుంటారని, ఇండియాలోని ఈ కరోనా నుండి కనీసం సింప్టమ్స్ లేకుండా బయటపడగల సామర్థ్యం కలిగివ్యక్తి జగన్ అన్నారు. జగన్ చాలా బలమైన వ్యక్తి అని, ఏ కరోనా ఆయనను ఏం చేయలేదన్నారు.