జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల దించుకోవాలి: నిప్పులు చెరిగిన అమిత్ షా

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల‌దించుకో వాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదని, జగన్‌ పాలనలో విశాఖపట్టణం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. షా అన్నారు. విశాఖపట్టణం రైల్వే గ్రౌండ్‌లో రాష్ట్ర బీజేపీ నిర్వ‌హించిన బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజును, తెన్నేటి విశ్వనాథం, పీవీజీ రాజును స్మరించుకుందామన్నారు.

మోడీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నినాదమే వినిపిస్తోందని అన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెబుతున్నది నిజం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం..సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని.. షా పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్‌ చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు.

ప్రధాని మోడీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. జగన్‌ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామన్న అమిత్ షా.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందా..? అంటూ ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందన్నారు. విశాఖపట్టణం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని అమిత్ షా వెల్లడించారు.

భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కి అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఇచ్చామన్న అమిత్ షా.. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖ, 3 వైద్య కళాశాలలు ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్లతో మరోసారి మోడీ ప్రధానిగా గెలవటం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 20 లోక్‌సభ స్థానాలు బీజేపీ గెలవాలని పార్టీ శ్రేణులకు కేంద్ర హూం మంత్రి అమిత్ షా తెలియజేశారు.