ప్రియాంక్ టాప్ గేర్ !

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణా పై ప్రత్యేక దృష్టి పెట్టారా ? పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదుంది. ఆ ఊపుతోనే ఈ ఏడాది చివరలో జరగబోతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోబోతున్నది. ఈ నాలుగులో ఛత్తీస్ గడ్, రాజస్ధాన్ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి పై రెండురాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటంతో పాటు మిగిలిన రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నది.

తెలంగాణా నేతల్లో చాలామంది కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళొచ్చారు. కాబట్టి అక్కడి పరిస్ధితులు అర్ధమయ్యే ఉంటుంది. అందుకనే కర్నాటకలో అమలుచేసిన వ్యూహాలనే ఇక్కడ కూడా ఫాలో అవ్వాలని అధిష్టానం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంక యాక్టవ్ రోల్ పోషించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అవకాశం దొరికినపుడల్లా ప్రియాంక తెలంగాణాకు వస్తున్నారు.

రెగ్యులర్ గా సీనియర్ నేతలందరితోను టచ్ లో ఉంటున్నారు. ఈనెల 11,12 తేదీల్లో సీనియర్లను ఢిల్లీకి రమ్మని కబురుచేసింది. అలాగే ఈనెల 25వ తేదీన ఖమ్మంలో జరగబోతున్న బహిరంగసభకు ప్రియాంక, రాహుల్ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క చేస్తున్న పాదయాత్ర 25వ తేదీన ఖమ్మంలో ముగియబోతోంది. ఆ సందర్భంగా ఏర్పాటుచేస్తున్న బహిరంగసభకు రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించారు.

బహిరంగ సభను పక్కన పెట్టేస్తే కొన్ని జిల్లాల్లో ప్రియాంక పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా ప్రియాంక ఎన్నికల ప్రచారంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగారు. అదే పద్ధతిలో తెలంగాణలో తిరిగి పార్టీకి మంచి ఊపు తేవాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. సీనియర్లంతా ఏకతాటిపైకి వస్తే క్యాడర్ మరింత జోష్ తో పనిచేస్తారని ఇప్పటికే సీనియర్లకు ప్రియాండ్ హితబోధ చేశారు. సీనియర్లను ఏకతాటిపైకి తేవడం కోసం ఇప్పటికే నాలుగు సార్లు తెలంగాణలో పర్యటించారు. సీనియర్లతో భేటీ జరిపారు. మొత్తం మీద ఇపుడిప్పుడే రాజకీయాలను ప్రియాంక సీరియస్ గా తీసుకున్నట్లు అర్ధమవుతోంది. ఏడాది కిందట ఇప్పుడున్నంత సీరియస్ గా ప్రియాంక తిరగలేదు. అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రియాంక ఇంత సీరియస్ గా తిరగలేదు.