మార‌ని నాని.. టీడీపీపై అదే రుస‌రుస‌..

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌న వైఖ‌రిని ఏ మాత్రం మార్చుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న ఎప్పుడు టీడీపీని తిడుతున్నారో.. ఎప్పుడు చంద్ర‌బాబుతో క‌లిసి న‌డుస్తున్నారో.. అస‌లు ఆయ‌న ఏం చేస్తున్నారో.. అర్థం కాక పార్టీ నాయ‌కులు, ఆయ‌న అనుచ‌రులు కూడా తీవ్ర స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా మరోసారి టీడీపీ అధిష్టానంపై నాని మండిపడ్డారు.

మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ల కోసం కూడా తాను పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయి’’ అని పేర్కొన్నారు.

‘‘వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తా. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు. బాబు ఢిల్లీ వెళ్తున్నారు రావాలని చంద్రబాబు పీఏ ఫోన్ చేస్తే వెళ్లాను’’ అని కేశినేని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్‌గా నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టంగాడు, చెప్పుతో కొడతా అన్నారు. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫొటో మీద వేశాం. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నా. నేను ఇక్కడ నుంచి పని చేస్తున్నా ఇంకా నేను ఎందుకు స్పందించాలి’’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.