కేసీయార్ కు కుమారస్వామి షాకిచ్చారా ?

కర్నాటకలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా బీజేపీ నేతలతో జేడీఎస్ ముఖ్యులు సమావేశమయ్యారట. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయంతో జేడీఎస్ కుంగిపోయింది. దాన్నుండి బయటపడేందుకు బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైంది. నరేంద్రమోడీ పరిపాలనను ప్రతిపక్షాలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ్ అభినందించారు. ఒడిస్సా రైలు దుర్ఘటనలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పాత్రలేదు కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని దేవేగౌడ్ అభిప్రాయపడ్డారు.

మొత్తానికి జేడీఎస్ అడుగులు ఎన్డీయే వైపు పడుతున్నాయని అర్ధమవుతోంది. అయితే ఇంతకాలం కేసీయార్ తో సఖ్యతగా ఉంటున్న పార్టీ హఠాత్తుగా ఎన్డీయేవైపు మొగ్గుచూపటం ఆశ్చర్యంగానే ఉంది. కేసీయార్ తో కలిసి జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటామని, కర్నాటకలో బీఆర్ఎస్ బలోపేతానికి మిత్రపక్షంగా జేడీఎస్ ఉంటుందని గతంలో కుమారస్వామి హైదరాబాద్ లో ప్రకటించారు. మరా ప్రకటనలన్నీ ఇపుడు ఏమయ్యాయో అర్ధంకావటంలేదు.

మొన్నటి కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయలేదు. అప్పుడే ఇద్దరి మధ్యా ఏదో జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. పోటీ చేయకపోగా జేడీఎస్ అభ్యర్ధుల గెలుపుకు కూడా కేసీయార్ వెళ్ళి ప్రచారం చేయలేదు. మరిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో స్పష్టంగా తెలీదుకానీ ఇపుడు జేడీఎస్ మాత్రం ఎన్డీయే వైపు ప్రయాణం మొదలుపెట్టింది. తాజా పరిణామాలను చూస్తుంటే తొందరలోనే ఎన్డీయేలో చేరేట్లు కనబడుతోంది.

మొన్నటి ఎన్నికల్లో సుమారు 200 సీట్లలో పోటీచేసిన జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అనుకున్నారు. అయితే కేవలం 19 సీట్లలో గెలుపుతో చతికిలపడింది. జేడీఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకంతా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ తమ ఓటు బ్యాంకును వెనక్కు తెచ్చుకోవాలంటే బీజేపీ తో చేతులు కలిపితేనే సాధ్యమవుతుందని దేవేగౌడ్ అనుకున్నట్లున్నారు. అందుకనే అర్జంటుగా నరేంద్రమోడీని అభినందించటం మొదలుపెట్టారు. బహుశా ఈ విషయాన్ని కేసీయార్ ఊహించుండరేమో. అందుకనే ఏమీ మాట్లాడలేక జేడీఎస్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారంతే. ఎన్నికల్లో తిరస్కరించిన జేడీఎస్ తో చేతులు కలిపినంత మాత్రాన బీజేపీ మళ్ళీ బలోపేతమవుతుందా ?