రెజ్లర్ పట్టుదలకు కేంద్రానికి మైండ్ బ్లాంక్

రెజ్లర్ల పట్టు దెబ్బకు కేంద్ర ప్రభుత్వం విలవిల్లాడిపోయింది. దాదాపు 50 రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లను వేరే దారి లేక చివరకు కేంద్ర మంత్రి చర్చలకు పిలిచారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు చర్చలు జరిపారు. వీళ్ళ డిమాండ్లలో చాలా వాటికి మంత్రి అంగీకరించటంతో ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇంతకీ వీళ్ళ డిమాండ్లు ఏమిటంటే తమను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలన్నది ప్రధానమైనది.

అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు మహిళనే అధ్యక్షురాలిగా నియమించాలని, రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరపాలని, సమాఖ్య పాలకమండలిలో బ్రిజ్ కానీ బ్రిజ్ కుటుంబ సభ్యులు, మనుషులు కానీ ఎవరూ ఉండేందుకు లేదన్నారు. సమాఖ్యలో అంతర్గతంగా ఫిర్యాదుల కమిటిని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనల్లో తమపై పెట్టిన కేసులను ఎత్తేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. వీటిల్లో బ్రిబ్ ను వెంటనే అరెస్టు చేయాలనే డిమాండును తప్ప మిగిలిన వాటిల్లో చాలావాటికి కేంద్రమంత్రి అంగీకరించారు.

బ్రిజ్ ను అరెస్టు చేయడమన్నది పోలీసులు, కోర్టు మధ్య ఉన్న వ్యవహారంగా మంత్రి చెప్పారు. ఇక మిగిలిన డిమాండ్లలో చాలావరకు ప్రభుత్వం చేతిలోనివే కాబట్టి వెంటనే అమల్లోకి తెస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. అయితే బ్రిజ్ ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వానికి జూన్ 15వ తేదీని డెడ్ లైన్ గా రెజ్లర్లు చెప్పారు. ఆరోజుకు బ్రిజ్ ను గనుక పోలీసులు అరెస్టు చేయకపోతే వెంటనే తాము మళ్ళీ ఆందోళనలకు దిగుతామని ముందే హెచ్చరించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే రెజ్లర్ల డిమాండ్లలో చాలావరకు న్యాయమైనవి, ఆమోద యోగ్యమైనవే. మహిళా సమాఖ్యకు మహిళే అధ్యక్షురాలిగా ఉండాలని కోరుకోవటంలో తప్పేముంది. అలాగే అంతర్గతంగా ఫిర్యాదుల కమిటి ఉండాల్సిందే. ఇక క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించటంలో ప్రభుత్వం ఫెయిలైంది. కాబట్టి వెంటనే ఎన్నికలు పెట్టాల్సిందే. సమాఖ్య పాలకవర్గంలో బ్రిజ్ సంబంధీకులు ఎవరు ఉండేందుకు లేదన్న డిమాండులో కూడా తప్పేమీలేదు. ఇంతకాలం కేంద్రం రెజ్లర్ల ఆందోళనలను పట్టించుకోకపోవటంతో అంతర్జాతీయంగా పరువుపోయిందనే చెప్పాలి. ఇప్పటికైనా దిగొచ్చినందుకు సంతోషం.