కేసీయార్ లో అయోమయం పెరిగిపోతోందా ?

అధికార బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కేసీయార్ ఒక్కోసారి ఒక్కోలాగ మాట్లాడుతున్నారు. ఒకసారేమో సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్లిస్తానని ప్రకటించారు. టికెట్లు దక్కుతాయో లేదో అనే భయం వద్దని అందరికీ టికెట్లు గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. అందరు నియోజకవర్గాల్లో పర్యటించి గెలుపుకోసం పనిచేసుకోమని భరోసా ఇచ్చారు. దాంతో అందరు హ్యాపీగా ఫీలయ్యారు.

అయితే కొద్దిరోజులుగా మంత్రులు, ఎంఎల్ఏలతో మాట్లాడుతు సర్వే నివేదిక ఫీడ్ బ్యాక్ చూపించి తలంటుపోస్తున్నారు. వ్యతిరేకత ఎక్కువగా ఉన్న మంత్రులు, ఎంఎల్ఏలకు టికెట్లిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఒకవైపు అందరికీ టికెట్లని హామీలిచ్చి ఇపుడేమో వ్యతిరేకతున్న వాళ్ళకి టికెట్లిచ్చేది లేదని చెప్పటంలో అర్ధమేంటి ? కేసీయార్లో పెరిగిపోతున్న గందరగోళానికి ఇది ఉదాహరణగా నిలిచిపోతోంది. ఎంఎల్ఏల పని తీరు మీద కేసీయార్ ఎప్పటినుండో సర్వేలు చేయించుకుంటున్నారు.

చాలామంది పనితీరుమీద బాగా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, అవినీతి ద్వారా ఆస్తులు కూడేసుకోవటంలో బిజీగా ఉంటున్నారని రిపోర్టుల్లో స్పష్టంగా బయటపడింది. ఒక సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు 45 మంది ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలున్నాయని మండిపడ్డారు. మరి మంత్రులు, ఎంఎల్ఏల మీద ఇంత వ్యతిరేకత ఉందని తెలిసిన తర్వాత కూడా సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ అని హామీ ఎలాగిచ్చారు ? ఇపుడు ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎంఎల్ఏలకు ఎందుకు తలంటుపోస్తున్నట్లు ?

ఇక వారసులకు టికెట్ల విషయంలో కూడా గందరగోళంగానే ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, మంత్రులు, ఎంఎల్ఏలు సుమారు 30 మంది తమ వారసులకు టికెట్లివ్వాలని పట్టుబడుతున్నారట. అయితే వారసుల్లో కొందరిపైన సిట్టింగులకు మించిన ఆరోపణలున్నాయన్న విషయం కేసీయార్ ఫీడ్ బ్యాక్ లో తేలింది. తండ్రుల పదవులను అడ్డంపెట్టుకుని వారసులే నియోజకవర్గాల్లో దుమ్ముదులిపేస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయట. వారసులకన్నా తండ్రులే నయమని కేసీయార్ అనుకుంటున్నారు. అందుకనే వారసులకు టికెట్లిచ్చేది లేదని గట్టిగా చెబుతున్నారట. మరి చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.