ఏపీలో జూన్ 1 మ‌రో బాదుడు.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో బాదుడు కార్య‌క్ర‌మానికి రంగం రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధ‌ర‌ల‌ను పెంచేసింది. ఈ పెంచిన ధ‌ర‌లు జూన్ 1 నుంచి అమ‌లులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో స్థిరాస్తుల మార్కెట్‌ విలు­వలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్‌ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్‌ ఏరియాల్లో మార్కె­ట్‌ విలువలను సవరించనున్నారు.

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్‌ ఏరియాల్లో రిజిస్టర్‌ విలువలకు, మార్కెట్‌ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్‌ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.

ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్‌ విలువల, రిజిస్టర్‌ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్‌ ఏరియాల్లోనే మార్కెట్‌ విలువల్ని పెంచ‌నున్నారు.  జూన్‌ 1వ తేదీ నుంచి మార్కెట్‌ విలువల సవరణ అమల్లోకి రానుంది.

సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్‌ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్‌ విలువలను సవరిస్తుంది.   కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో రేట్ల‌ను పెంచారు. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్‌ రివిజన్‌ చేపట్టి తాజాగా మ‌రింత పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. .

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు సిద్ధమవడంతో.. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు బారులు తీరారు. చలానాలు పెంచడంతో తమపై అధిక భారం పడుతుందని భావించిన ప్రజలు   రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారికి కొత్త సమస్య ఎదురైంది. రెండు రోజులుగా సర్వర్ పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు పక్కన పెట్టారు.