కొడాలికి కాపుల సెగ‌..

kodali

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి,ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి కాపుల‌సెగ ప‌ట్టుకుంది. గుడివాడ నియోజ‌క వ‌ర్గం నుంచి వ‌రుస‌గా గెలుస్తున్న నానికి ఇక్క‌డ 32 శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీల‌కంగా ఉన్నాయి. అయి తే.. అనూహ్యంగా ఇప్పుడు వారి నుంచే సెగ పెరుగుతుండ‌డంతో కొడాలి వ‌ర్గం త‌ర్జ‌న భ‌ర్జ‌నలో ప‌డింది. తాజాగా కాపులు ఏకంగా కొడాలిపై విరుచుకుప‌డ్డారు.

కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్‌ చేశాయి. కాపులను కులం పేరుతో దూషించడాన్ని ఐక్య కాపునాడు, కాపు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కులం పేరుతో బూతులు తిట్ట డాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయన్నారు.

రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకో వాలని హితవు పలికారు. కొడాలి నానీని వైసీపీ కాపు నాయకులు ప్రశ్నించ డంతోపాటు కాపు సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొడాలిపై పోలీసులు సుమోటోగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ కాపు జాతిని అవహేళన చేయడం ఆంధ్ర రాష్ట్రానికే అవమానమన్నారు.

కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి  బాలాజీ హెచ్చరించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ దుమారం రేగింది. దీనిపైకొడాలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.