పిల్లలకు షాకిచ్చిన కేసీఆర్.. ఈసారికి మాత్రం పెద్దలకే టికెట్లు

మరో నాలుగైదు నెలల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చేశారు. టికెట్ల కేటాయింపునకు సంబంధించిన పలువురు సిట్టింగు ఎమ్మెల్యేలు.. ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈసారికి మాత్రం అలాంటి అవకాశం లేదని.. పెద్దలే పోటీ చేయాలన్న విషయాన్ని గులాబీ బాస్ తేల్చేశారంటున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల ప్రయత్నాల్ని గుర్తించిన కేసీఆర్.. అందరితో కాకుండా కొందరితో తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేయటంతో పాటు.. వారికి చెప్పిన మాటతో తన ఆలోచనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పార్టీలోని వారికి అర్థమయ్యేలా చేశారంటున్నారు. తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేయటం.. ఆ విషయాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పేయటం తెలిసిందే.

ఇలాంటి వేళ.. పోచారంతో మాట్లాడిన సీఎం.. ఈసారికి వారసులకు టికెట్లు ఇచ్చే ఆలోచన లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ఈసారికి మీరే బరిలోకి దిగాలన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. తాజాగా జరిపిన తన పర్యటనలో పోచారమే బరిలోకి దిగుతారన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేశారు. దీంతో.. పోచారం సైతం ఈసారి ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు చెప్పాల్సి వచ్చింది.

మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవటం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈసారికి మాత్రం తాను టికెట్ ఇచ్చే ఆలోచన లేదన్న విషయాన్ని ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఇప్పించుకోవటంలో తలసాని సక్సెస్ అయినప్పటికీ.. విజయం సాధించే విషయంలో మాత్రం బోల్తా పడ్డారు.

ఈసారి ఎన్నికల్లో తలసాని కొడుక్కి టికెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ సానుకూలంగా లేరన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్లే.. టికెట్ ఇచ్చే అవకాశం లేదని గులాబీ బాసే నేరుగా తేల్చేసిన నేపథ్యంలో తలసాని నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. మండలి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఛాన్సు ఇవ్వాలని చెప్పగా.. అది కూడా కుదరదని చెప్పినట్లుగా చెబుతున్నారు.

అదే విధంగా నిజామాబాద్.. ఉమ్మడి కరీంనగర్.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లోని ఒకరు చొప్పున ఎమ్మెల్యే తమ వారసులకు టికెట్ ఇవ్వాలన్న రిక్వెస్టులు ఉన్నాయి. వాటన్నింటిని హోల్ సేల్ గా నో చెప్పేసినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చే ఆలోచన లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేయటంతో టికెట్ ఆశ పెట్టుకున్నోళ్లకు గులాబీ బిగ్ బాస్ నిర్ణయం షాకింగ్ గా మారింది.