మోడీ ఇమేజ్ ను తమ ఖాతాలో వేసుకుంటున్న 11 రాష్ట్రాలు

రాజకీయాన్ని చదరంగంగా పోల్చేవారెందరో. ఇక్కడ ఎవరికి ఎవరి మీదా ప్రత్యేకమైన అభిమానాలు.. ప్రేమలు ఉండవు. అలా ఉన్నట్లు కనిపిస్తే.. అదంతా మాయనే. ఒకవిధంగా చెబితే.. అదే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి. రాజకీయాల్లో ఒకరి క్రెడిట్ ను మరొకరు తమ ఖాతాలో వేసుకోవటం మామూలే. కేంద్రం అమలు చేసే పథకాల్ని తమ ఖాతాలో వేసుకోవటం.. తరచూరాష్ట్రాలు చేసేవే. తాజాగా ఆ విషయం మీదన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు కోపం వచ్చింది.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకే దేశంలోని పేదలకు అందించే బియ్యం.. గోధుమలకు సంబంధించి కేంద్రానికి రావాల్సిన పేరు రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లబ్థిదారులకు రేషన్ సరుకులు ఇవ్వటంలో కేంద్రానిదే కీలక పాత్ర అని.. అందుకు అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరిస్తుందని ఆయన పేర్కొంటున్నారు. దేశం మొత్తమ్మీదా పది వేల కోట్లు కూడా ఖర్చుపెట్టని రాష్ట్రాలు.. తామే రేషన్ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్నికేంద్రం కిలో రూ.2చొప్పున.. గోధుమలు రూ.3 చొప్పున అందజేస్తున్నారు. వీటిని ఆయా రాష్ట్రాలు తమకు తోచినట్లుగా కొందరు ఉచితంగా అందిస్తుంటే.. మరికొందరు నామమాత్రంగా వసూలు చేస్తున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నెలసరిగా ఇచ్చే బియ్యాన్ని కేజీ రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ పథకానికి సంబంధించి సింహభాగం కేంద్రమే నిధుల్ని జారీ చేస్తుందని రాంవిలాస్ చెబుతున్నారు. కానీ.. కేంద్రానికి ఇవ్వాల్సిన క్రెడిట్ మాత్రం రాష్ట్రాలు ఇవ్వట్లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ తరహా రాష్ట్రాలు పదకొండు ఉన్నాయని చెప్పిన ఆయన.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని చెబుతున్నారు.

కేంద్రానికి రావాల్సిన పేరును రాష్ట్రాలు తమ ఖాతాలోకి మళ్లించుకోవటంపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో వ్యవహరించే రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నట్లు వెల్లడించారు.

కేంద్రానికి వచ్చే పేరును తమ ఖాతాలో వేసుకునే పదకొండు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్.. ఒడిశా.. పశ్చిమబెంగాల్.. కేరళ.. తమిళనాడు.. కర్ణాటక.. త్రిపురలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కేంద్రమంత్రి అసహనం నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో?