ఎన్టీఆర్.. విజయశాంతి.. ఒక క్షమాపణ కథ

ఈ రోజు లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు వందో పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన గొప్పదనాన్ని చాటే ఎన్నో ఉదంతాల గురించి ఎంతోమంది ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ లాగే సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకుని.. రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయశాంతి ఈ మహా నటుడు, నాయకుడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన గొప్పదనాన్ని చాటుతూ ట్విట్టర్లో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్ తనకు క్షమాపణ చెప్పిన ఒక ఉదంతం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. సుమారు 1980లో తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ చెబుతాను.

1990లో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా కోసం ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్నప్పుడు.. నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ గారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. ఐతే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేను హైదరాబాద్‌లో షూటింగ్ కోసమని ఆ ఉదయం విమానాశ్రయానికి వెళ్లాను.

‘‘అమ్మాయిని మేము చూసుకోలేదు.. పొరపాటు జరిగింది.. ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి’’ అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో ఎన్టీఆర్ గారు చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతాది. అంతేగాక ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని.. ఫోన్ చేసి మరీ “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry …” అని చెప్పారు. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే’’ అని విజయశాంతి ఎన్టీఆర్ ఔన్నత్యం గురించి గొప్పగా చెప్పారు.