అన్నా.. అంటూ కన్నీరు పెట్టేసుకున్న కేసీఆర్

కాలం మహా విచిత్రమైనది. సాదాసీదా నేతల్ని సైతం సమయం సూపర్ పవర్ గా మార్చేస్తుంటుంది. తెలుగు నేలను ఏలిక ఎన్టీఆర్ హయాంలో ఎంతో మంది నేతల్ని ఆయన తయారు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్యూచర్ నేతల్ని తయారు చేసిన క్రెడిట్ ఎన్టీఆర్ కు దక్కుతుంది. ఈ రోజున తెలంగాణ రాజకీయాల్లో సూపర్ పవర్ గా ఉంటూ.. ఆయనకు సమీప దూరానికి రాలేని మేరునగంగా ఉన్న అధినేత కేసీఆర్. అలాంటి ఆయన ఒక సమయంలో ఎన్టీఆర్ మీద ఎంతలా ఆధారపడ్డారు?

ప్రచారానికి వస్తానన్న ఆయన రాకపోయిన కారణంగా ఎంతలా నష్టపోయారన్న దానికి నిదర్శనంగా ఒక ఉదంతాన్ని చెప్పాలి. చదివినంతనే.. అప్పట్లో అలా జరిగిందా? అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..
1983 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ను సొంతం చేసుకున్నారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారం ప్రచారానికి రావాల్సిన ఎన్టీఆర్ రాని కారణంగా కేసీఆర్ ఓటమిపాలయ్యారు. ఆ విషయాన్ని ఎవరో కాదు.. కేసీఆరే స్వయంగా చెప్పటం.. అది కూడా పోలింగ్ కు ముందే తన ఓటమి పైన ఆయన అంచనాకు వచ్చేయటం ఆసక్తికరమని చెప్పాలి. 1983 జనవరి 3 ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ 1982 డిసెంబరు 31న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది.

ఆ సీటును సంజయ్ విచార్ మంచ్ కు కేటాయించటంతో మేనకాగాంధీతో కలిసి ఎన్టీఆర్ అక్కడకు ప్రచారానికి వెళ్లారు. అప్పటికే జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్.. తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారే తప్పించి.. ఆపింది లేదు. చెన్నూరు తర్వాత ఆయన సిద్దిపేటలో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే.. ఆ టైంలో ఆయన స్వయంగా పోటీలో ఉన్న గుడివాడ.. తిరుపతి నియోజకవర్గాలు గుర్తుకు వచ్చాయి. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రచార రథం మీద అయితే వెళ్లటం కష్టమని భావించిన ఎన్టీఆర్.. కారులో బయలుదేరారు.

ఆయన కారులో వెళుతున్న సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. రహస్యంగా ఉంచారు. ఆ కారు సిద్దిపేటకు చేరుకునేసరికి తెల్లవారుజామున రెండున్నర గంటలైంది. రోడ్డుకు అనుకొని ఉన్న వేదిక వద్ద తెలుగుదేశం జెండాలతో ఉన్న వాహనాల శ్రేణి అక్కడ ఆగింది. అక్కడ 200 మంది గుంపుగా ఉన్నారు. ఒక బక్కపల్చటి వ్యక్తి ఆందోళనగా ఉన్నారు. కారును ఆపిన వ్యక్తి.. అన్నగారు ఎక్కడ ున్నారో మీకు తెలుసా? అని కారు డ్రైవర్ ను అడిగారు. దీనికి బదులుగా.. డ్రైవర్ సమాధానం చెప్పేలోపు.. ‘చంద్రశేఖర్’ అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎన్టీఆర్ పిలుపును గుర్తు పట్టిన కేసీఆర్ వేదనతో.. అన్నా.. మీరు వస్తున్నారని లక్ష మంది పోగయ్యారు. అయిదారు గంటల ముందు వచ్చి ఉంటే గ్యారెంటీగా గెలిచేవాడ్ని. ఇప్పుడు అంతా అయిపోయిందంట కంటనీరు పెట్టుకున్నారు. ఆయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికల్లో ఇప్పటి కేసీఆర్.. అప్పటి చంద్రశేఖర్ రావు ఓడారు. ఈ ఎన్నికలు పూర్తైన రెండేళ్లలోపే చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరగటం.. ఆ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించటం జరిగింది.

ఇక్కడో మరో విషయాన్ని చెప్పాలి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగు ప్రజలకు సుపరిచితులు. 1983 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కింది. కేసీఆర్ మాదిరే ఆయన నియోజకవర్గానికి కూడా ప్రచారానికి వస్తానన్న ఎన్టీఆర్ రాలేకపోవటం.. ఆ ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి బరిలోకి దిగిన తుమ్మల ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మీరు ప్రచారానికి వస్తారని మాటిచ్చారు. రాలేదు. తాను ఓడిన విషయాన్ని చెప్పిన తుమ్మలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. తుమ్మల అందుకు ఒప్పుకోలేదు. ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని చెప్పి.. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల సందర్భంగా తుమ్మల చేతికి బీఫారమ్ ఇచ్చే సందర్భంలో ఎన్టీఆర్.. బ్రదర్.. ఈసారి సత్తుపల్లి ప్రచారానికి వస్తా.. మీరు గెలుస్తున్నారన్న హామీ ఇవ్వటమే కాదు.. ప్రచారం చేయటం.. ఆయన గెలవటం జరిగింది. ఇలా 1983లో పోటీ చేసిన కేసీఆర్.. తుమ్మల ఇద్దరూ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లని కారణంగా ఓటమి పాలైతే.. తర్వాతి ఎన్నికల్లో వీరిద్దరూ విజయం సాధించటం విశేషం.