జ‌గ‌న్ మేన‌త్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత‌,సీఎం జ‌గ‌న్ మేన‌త్త విమ‌లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వైపు వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ నుంచి త‌ప్పించుకుంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి త‌న త‌ల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌న మాతృమూర్తి శ్రీల‌క్ష్మి వైద్యం పొందుతున్న క‌ర్నూలు జిల్లాలోని విశ్వ‌భార‌తి వైద్యాల‌యం కూడా ఇదే విష‌యాన్ని బులెటిన్ రూపంలో వెల్ల‌డించింది. దీంతో అంద‌రిలోనూ కొంత సింపతీ ఏర్ప‌డింది.

అయితే.. అంద‌రూ ఇలా అనుకుంటున్న స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి సొంత చెల్లెలు, సీఎం జ‌గ‌న్‌కు మేన‌త్త అయిన విమ‌లా రెడ్డి తాజాగా ఆసుప‌త్రికి వ‌చ్చి శ్రీల‌క్ష్మిని ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్టాడుతూ.. అవినాష్ కు ధైర్యం చెప్పి వచ్చానన్నారు. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం చెప్పానన్నారు. శ్రీలక్ష్మి ఉపవాసాలు ఎక్కువ చేస్తోందని.. దీంతో లోబీపీ వచ్చిందని విమలారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం లిక్విడ్ ఫుడ్ సెలైన్ రూపంలో ఇస్తున్నారని తెలిపారు. ఆమెకు ఏమీ కాలేద‌ని.. ప్రాణాపాయం లేద‌ని.. అంతా ప్ర‌భువు చూసుకుంటాడ‌ని చెప్పారు.

త‌న భ‌ర్త జైల్లో ఉండ‌డం(భాస్క‌ర‌రెడ్డి), అవినాష్‌రెడ్డి పై మీడియా చేస్తున్న ప్ర‌చారం, సీబీఐ వాళ్లు చేస్తున్న ప్ర‌చారంతో శ్రీల‌క్ష్మి మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. ప్రాణాపాయం లేద‌ని.. అంతా బాగానే ఉంద‌ని ప‌దే ప‌దే చెప్పారు. ఇక‌, దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకా మంచిగా జీవించారని చెప్పారు. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని విమలారెడ్డి పేర్కొన్నారు.

శ్రీలక్ష్మి కోసం ప్రార్థన చేయడానికి ఆసుప‌త్రికి వచ్చానని విమ‌లా రెడ్డి తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారని ప‌రోక్షంగా అప్రూవ‌ర్ ద‌స్త‌గిరిని ప్ర‌స్తావించారు. దీనిని తాను తట్టుకోలేకపోతున్నానన్నారు. అవినాష్ ను టార్గెట్ చేస్తున్నారని.. లేట్ అయినా న్యాయం జరుగుతుందన్నారు. సునీత, అవినాష్ ఇద్దరూ తన వాళ్లేనని విమలారెడ్డి పేర్కొన్నారు.