రాహుల్ జర్నీ వర్కవుటవుతుందా ?

జనాలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధి రూటు మార్చినట్లున్నారు. ఇందులో భాగంగానే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. అయితే అది తృప్తినిచ్చినట్లు లేదు. కర్నాటకలో ఘనవిజయం సాధించటంలో పాదయాత్ర కూడా కీలకపాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. దాంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడిని కంటిన్యు చేయాలని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్తిగా రూటు మార్చేశారు.

ఇంతకీ రాహుల్ మార్చిన రూటు ఏమిటంటే ఢిల్లీ నుండి ఛండీగఢ్ వరకు ఒక లారీలో ప్రయాణించారు. లారీలోని డ్రైవర్, క్లీనర్ తో మాట్లాడారు. వాళ్ళ ప్రాంతాల్లోని పరిస్ధితులను వాకాబుచేశారు. మధ్యలో లారీ ఆగిన దాబాల్లో తిండితిని, టీ తాగారు. దాబాల్లోనే భోజనం చేస్తున్న అందరి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. అడిగిన వాళ్ళతో సెల్ఫీలు దిగారు. వాళ్ళ ప్రాంతాల్లోని సమస్యలు, పరిష్కారాలపై మాట్లాడారు. అలాగే తనదగ్గరకు వచ్చిన జనాలకు షేక్ హ్యాండిస్తు, ఫొటోలకు ఫోజులిచ్చారు.

పనిలో పనిగా ఓల్డ్ ఢిల్లీలో కూడా ఆకస్మికంగా పర్యటించారు. రెస్టారెంట్లలో సందడిచేశారు. తమ రెస్టారెంట్ లోకి రాహుల్ రావటాన్ని ఏమాత్రం ఊహించని యజమానులు షాక్ కొట్టినట్లు అయిపోయారు. తర్వాత వెంటనే తేరుకుని వాళ్ళే దగ్గరుండి అడిగినవాటిని సర్వ్ చేశారట. ఇలాగ కొన్ని రెస్టారెంట్లలోకి వెళ్ళటం యజమానులతో మాట్లాడటం, టిఫిన్, భోజనాలు చేస్తున్న కస్టమర్లతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా మామూలు జనాలతో కలిసిపోవటంలో భాగంగానే రాహుల్ చేస్తున్నారు.

పార్టీ సమావేశాల్లో మాట్లాడటం, బహిరంగసభల్లో ప్రసంగించటం, తనను కలిసిన నేతలకు దిశానిర్దేశం చేయటం వల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవని రాహుల్ కు అర్ధమైనట్లుంది. అందుకనే భారత్ జోడో యాత్ర చేశారు. ఆ యాత్ర కొంత ఫలితాన్ని ఇచ్చినట్లే ఉంది. అందుకనే అదే యాత్రను కాస్త రూటుమార్చి తాను డైరెక్టుగా జనాల్లోకి వెళిపోతున్నారు. కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళిపోయి విద్యార్ధులతో మాట్లాడటం, మెస్ లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనాలు చేయటం అంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. మరి ఈ కష్టం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.