రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..

ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం  ఇప్పుడు దేశ  ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను  వదిలించుకునేందుకు  జనం  నానా తంటాలు  పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల  డిపాజిట్ దాటితే  ప్యాన్ నెంబర్  తప్పనిసరి అని రిజర్వ్  బ్యాంక్ ప్రకటించడం జనానికి  ఇబ్బందేనని చెబుతున్నారు. దానితో 2016 నాటి పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ తో  పాటు  సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

బ్యాంకుల్లోకి వచ్చే రూ.2 వేల నోట్ల సొమ్ములో 40 నుంచి యాభై  శాతం అంటే దాదాపుగా రూ. 90 వేల కోట్ల వరకు దీర్ఘకాలిక డిపాజిట్లుగా మారతాయని  అంచనా వేస్తున్నారు బ్యాంకులు కొత్త రుణాలిచ్చి లాభాలు పొందేందుకు వారి వద్ద ఇబ్బడి ముబ్బడిగా నిధులుంటాయి. దానితో బ్యాంకుల ఆర్థిక స్థితి, లాభాలు మెరుగు పడే ఛాన్సుంది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ మాత్రమే జరుగుతోందని, చెలమాణి కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ జనంలో భయం మాత్రం కొనసాగడం ఖాయం. ఆ నోట్లను ఏదో విధంగా బ్యాంకులకు చేర్చడం అంతే ఖాయం.