ఈ సారి కూడా టీడీపీ ఓడిపోతే..

Atchannaidu Kinjarapu

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే.. పాల‌న ప్రారంభించి నాలుగేళ్లు జ‌రిగిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అభివృద్దీ లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో లెక్క‌కు మించిన‌ అప్పులు చేస్తున్నార‌ని.. మ‌ద్య నిషేధం చేస్తామ‌ని న‌మ్మించి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేద‌ని.. విప‌క్షాలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌ధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీనేన‌ని కూడా మేదావుల నుంచి రాజ‌కీయ విశ్లేష‌కుల వ‌ర‌కు అంద‌రూ చెబుతున్నారు.

అయితే..తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షసి పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి చంద్రబాబు కానీ, టీడీపీ కానీ, ఓడిపోతే పార్టీకి, చంద్ర‌బాబుకు జ‌రిగే న‌ష్టం ఏమీలేద‌ని. పార్టీ ప్ర‌జ‌ల కోసం అంకిత భావంతోనే ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్ర‌జ‌లే ఒక సారి ఆలోచించుకోవాల‌ని అన్నారు. ఇప్ప‌టికే నానా ర‌కాల ప‌న్నుల‌తో ప‌డుతూ లేస్తూ ఉన్న కుటుంబాలు.. జ‌గ‌న్ బాదుడును భ‌రించ‌లేక‌.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందేనన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్ర‌జ‌లు ఏ గ‌ట్టున ఉంటారో నిర్ణ‌యించుకోవాల‌ని అచ్చెన్నాయుడు సూచించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. కేసును తప్పు దారి పట్టిస్తూ సీబీఐతో ఆడుకుంటున్నార‌ని అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

మహానాడుకు ప్రజలంతా తరలి రావాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. ఏ తప్పు చేయని తనను అరెస్టు చేసి, తన బాబాయ్ హత్య కేసులో నిందితుడైన తమ్ముడిని అరెస్టు చెయ్యనియ్య కుండా సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నా రని ప‌రోక్షంగా ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.