జీ7 వేదికపై మోడీ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ఆయన.. ఐక్యరాజ్య సమితి ఉనికిని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ బాధిత దేశంగా మారటం.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ మాట్లాడిన వేళలో.. తాజా సంక్షోభంపై తాను వ్యక్తిగతంగా కూడా చొరవ చూపుతానని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన మోడీ.. తాజాగా ఐక్యరాజ్య సమితిపై మరే భారత ప్రధాని చేయని రీతిలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలకు దిగటం ద్వారా.. ఆయన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. భారత దేశానికి జరుగుతున్న అన్యాయం.. భద్రతామండలిలో భారత్ కు చోటు కల్పించని వైనంపై భారత్ ఎంత ఆగ్రహంతో ఉందన్న విషయాన్ని నరేంద్ర మోడీ తన మాటలతో తేల్చేశారని చెప్పాలి. ఐక్యరాజ్య సమితిపై విమర్శలు ఒక ఎత్తు అయితే.. సమితిలో సంస్కరణలపై ఆయన బలమైన గళాన్ని వినిపించారు. పరిస్థితులకు తగినట్లుగా సంస్కరణలు చేయకుంటే ఐక్యరాజ్య సమితి.. భద్రతా మండలి కేవలం టాక్ షాప్ మాదిరి మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్య సమితి లక్ష్యం శాంతి.. సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించటం.. కానీ ఘర్షణల్ని నిలువరించలేకపోతున్నారన్న మోడీ.. ఘర్షణలను నిలువరించలేని పరిస్థితుల్లో ఆ అంశాల్ని సమితిలో కాకుండా వేరే చోట ప్రస్తావించాల్సి రావటాన్ని ప్రశ్నించారు. ‘అలాగైతే అసలు ఆ సంస్థ ఎందుకు? అంతర్జాతీయ చట్టాలు.. సౌర్వభౌమాధికారం.. ప్రాదేశిక సమగ్రతకు తోడు సమితి నియమాలను అన్ని దేశాలు కచ్ఛితంగా గౌరవించాల్సిందే. అలా కాదంటూ ఏకపక్షంగా ముందుకు వెళుతూ.. వాస్తవ స్థితిని మార్చే ప్రయత్నాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. ఎంతటి వివాదమైనా.. శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలన్నది భారత్ ఎప్పుడూ చెప్పే మాట. ఈ స్ఫూర్తితోనే బంగ్లాదేశ్ తో భూ.. సముద్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఐక్య రాజ్య సమితి తీరుపై సీరియస్ కామెంట్లు చేసిన వైనం చూస్తే.. చైనా తీరును గట్టిగా ప్రశ్నించటమేనని చెప్పక తప్పదు.

ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదం అనే పదానికి కనీసం నిర్వచనాన్నీ ఆమోదించలేని స్థితిలో ఉందని తప్పు పట్టారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకుంటే.. ఎప్పుడో వందేళ్ల క్రితం ఏర్పాటైన సంస్థలు 21వ శతాబ్దానికి తగినట్లుగా లేవన్న విషయం అర్థమవుతుందన్నారు. దక్షిణాది ప్రాంతాల గొంతు వినిపించేలా సమితిలో సంస్కరణలు చేపట్టాలని.. అది జరగకుంటే ఘర్షణలు ఆపండని మాత్రమే మాట్లాడగలుగుతామని మోడీ వ్యాఖ్యానించటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఘర్షణలు రేగినా.. దాని ప్రభావం అన్ని దేశాల మీద పడుతుందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తంగా మోడీ వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఆయన ఇమేజ్ ను మరింత భారీగా పెంచటం ఖాయమని చెప్పక తప్పదు.