సిద్ధూ-డీకేలకు ఒకేసారి షాక్

నేతలు నేతలే అధిష్టానం అధిష్టానమే అని మరోసారి రుజువైంది. నేతలు ఎంత మొత్తుకున్నా అధిష్టానం ఫైనల్ గా తాను అనుకున్నట్లే వ్యవహారాలు నడుపుతుందనేందుకు కర్నాటకలో కొలువుతీరిన కొత్త మంత్రివర్గమే నిదర్శనం. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళతో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణంచేశారు. వీళ్ళ ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా కన్నడ కంఠీరవ స్టేడియంలో ఎంతో అట్టహాసంగా జరిగింది.

అయితే ప్రమాణస్వీకారానికి ముందే అధిష్టానం సిద్దూతో పాటు డీకేకి కూడా పెద్ద షాకిచ్చింది. ఇద్దరు ఢిల్లీకి వెళ్ళినపుడు వీళ్ళిద్దరితో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయటానికి అధిష్టానం అంగీకరించింది. ఈ మేరకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే వాళ్ళ జాబితా కూడా రెడీ అయ్యింది. కొత్త మంత్రులుగా కొలువుదీరబోయే వాళ్ళకు సమాచారం కూడా అందించారు. అంతా రెడీ అయిపోయి ఫ్యామిలీలు, బంధులు, మిత్రులతో కలిసి స్టేడియంకు చేరుకున్నారు.

తీరా చూస్తే సిద్ధూ, డీకేతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది 8 మంది మాత్రమే. మరి ముందుగా అనుకున్న సంఖ్యలో 20 మంది ఎందుకు తగ్గిపోయినట్లు ? 20 మంది పేర్లను ఎవరు తొలగించారు ? లిస్టులో నుండి ఎగిరిపోయిన పేర్లలో సిద్ధూ, డీకేల మద్దతుదారుల్లో ఎంతెంతమందున్నారు. అన్నది ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలోనే ఆరురోజుల పాటు బెంగుళూరు, ఢిల్లీలో ఎంత డ్రామాలు నడిచాయో అందరికీ తెలిసిందే.

అలాంటిది చివరి నిముషంలో మంత్రుల సంఖ్య, పేర్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటం కోసమే అధిష్టానం ఇద్దరికీ చెప్పకుండానే జాబితాలో నుంచి 20 మంది పేర్లను ఎత్తేసిందట. ప్రమాణస్వీకారానికి ముందు మాత్రమే సిద్ధూ, డీకేలను పిలిచి అధిష్టానం ఈ విషయాన్ని చెప్పిందని సమాచారం. దాంతో ఏమిచేయాలో ఇద్దరికీ దిక్కుతోచలేదు. మంత్రివర్గంలో తమ మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారని అంతకుముందు వరకు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారట. అయితే చివరి నిముషంలో జాబితా చూసిన తర్వాత ఇద్దరి మద్దతుదారులు చాలావరకు ఎగిరిపోయారు. ఇద్దరితో పాటు అధిష్టానంతో కూడా సన్నిహితంగా ఉండే ఎంఎల్ఏలతోనే మంత్రులుగా ప్రమాణం చేయించాల్సొచ్చిందని తెలుస్తోంది.