కొడాలి నానిపై రెచ్చిపోయిన బీజేపీ ఇన్‌ఛార్జ్‌

kodali

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ పేరుకే వైరి ప‌క్షాలు అన్న‌ది చాలామంది అనే మాట‌. జ‌గ‌న్ స‌ర్కారుతో లోపాయ‌కారీ ఒప్పందాల‌తో బీజేపీ ప‌ని చేస్తోంద‌ని.. వీరి మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ఉంద‌ని.. ఒక‌రినొక‌రు తీవ్రంగా విమ‌ర్శించుకోవ‌డం.. ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డం చేయ‌ర‌నే విమ‌ర్శ‌లు గ‌ట్టిగానే వినిపిస్తుంటాయి.

ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్.. వైసీపీ నేత‌లు, అలాగే జ‌గ‌న్ స‌ర్కారు గురించి తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వైసీపీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానిని ఆయ‌న గ‌ట్టిగానే టార్గెట్ చేశారు. నాని లాంటి నేత‌లను జైలుకు పంపిస్తామ‌ని సునీల్ హెచ్చ‌రించ‌డం విశేషం.
గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సునీల్ మాట్లాడుతూ.. జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అన్నారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని.. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతోంద‌ని సునీల్ వ్యాఖ్యానించారు. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే అని.. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారని సునీల్ విమ‌ర్శించారు.

సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయని.. ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయని… ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయని సునీల్ ఎద్దేవా చేశారు. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తున్నాయ‌ని… భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్‌లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుందని ఆయ‌న విమ‌ర్శించారు. ఇంత తీవ్ర స్థాయిలో వైసీపీని బీజేపీ నేత విమ‌ర్శించిన నేప‌థ్యంలో వైసీపీ నుంచి ఎలాంటి కౌంట‌ర్లు ఉంటాయో చూడాలి.